Facial Recognition : నేటి నుంచి ఎయిర్ పోర్టుల్లో ఎంట్రీకి కొత్త ఫీచర్-తొలుత మూడు చోట్ల..
దేశంలోని ఎయిర్ పోర్టుల్లో ఇవాళ్టి నుంచి ప్రయాణికుల ప్రవేశానికి మరో కొత్త భద్రతా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికుల్ని గుర్తించి ఎయిర్ పోర్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఎఫ్ఆర్టీ టెక్నాలజీ ద్వారా ఇకపై ప్రయాణికులు మరింత భద్రంగా ఎయిర్ పోర్టుల ద్వారా రాకపోకలు సాగించేందుకు వీలు కుదరనుంది.
ప్రయాణికులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణాలుచేసేందుకు వీలుగా ఇవాళ్టి నుంచి డిజీ యాత్ర పేరుతో ఓ ఫీచర్ ను అందబాటులోకి తెచ్చింది. దీంతో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టి) ఆధారంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు కాంటాక్ట్లెస్, అవాంతరాల్లేని ప్రాసెసింగ్ను పూర్తి చేయడానికి డిజీ యాత్ర సదుపాయం రూపొందించారు.
బోర్డింగ్ పాస్తో లింక్ అయిన ప్రయాణికుల గుర్తింపును నిర్దారించడానికి, వారి ముఖ లక్షణాలను ఉపయోగించి పేపర్లెస్, కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ ద్వారా ప్రయాణికులు విమానాశ్రయాలలోని వివిధ చెక్పాయింట్ల గుండా వెళ్లవచ్చని అధికారులు చెప్తున్నారు. తొలిదశలో ఇది ఏడు విమానాశ్రయాలలో దేశీయ విమాన ప్రయాణీకుల కోసం మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఇవాళ ఇది ఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లోకి అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో తర్వాత హైదరాబాద్, కోల్కతా, పూణె, విజయవాడ ఎయిర్ పోర్టుల్లో మార్చి 2023 కల్లా అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తారు. ఈ సదుపాయాన్ని వాడేందుకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సెల్ఫీ క్యాప్చర్ ని వాడుతున్నారు. ఇందుకోసం డిజీ యాత్ర యాప్ లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరమని అధికారులు తెలిపారు.