మరీ ఇంతలా దిగజారాలా : జాతీయ నేతలను గాడిదల్ని చేసిన బీజేపీ పోస్టర్
అధికారం అహంకారానికి తావిస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. పార్టీల మధ్య విబేధాలను పనిగట్టుకుని మరీ పెద్దవి చేసే పనిని ముందేసుకుంటారు కొంతమంది నేతలు. నోటికి చెప్పే పని సరిపోదనుకున్నప్పుడు విమర్శల స్థాయిని ఎవరెస్ట్ అంత పెద్దది చేసి చూపించడానికి ఇలా వ్యక్తిగత స్థాయిని కించపరిచేలా పోస్టర్లు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవి కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడం.. రావాల్సిన దానికంటే ఎక్కువే పబ్లిసిటీ రావడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది.
తాజాగా.. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ అయింది. అధికార పక్షం బీజేపీకి చెందిన మైనారిటీ సెల్ రూపొందించిన ఈ పోస్టర్ లో బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ ను పులి గర్జిస్తున్నట్టుగా చూపించగా..! కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ని పోస్టర్ లో గాడిదల్లాగా చిత్రీకరించారు.
యూపీలో యోగీ ఆదిత్యనాథ్ పాలనను కోరుకుంటున్నామని బీజేపీ మైనారిటీ సెల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా..! పోస్టర్ పై విపక్షాలన్ని మండిపడుతున్నాయి. ఎంత కేంద్రంలో తమ ప్రభుత్వం ఉంటే మాత్రం ఇష్టారాజ్యంగా ఇతర పార్టీ నేతలను అవమానపర్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు మిగతా పార్టీల నేతలు. ఇలాంటి పోస్టర్ లతో ప్రత్యర్థి పార్టీ నేతల ఇమేజ్ సంగతి ఏమో గానీ, బీజేపీయే చేజేతులా తమ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నట్టువుతుందని అభిప్రాయపడుతున్నారు పలువురు.