బీఎస్ఎఫ్ సైనికులకు ఓ శుభవార్త..
కొత్తగా పెళ్ళి చేసుకున్న సైనికులకు.. భార్యను ఇంటి దగ్గరే వదిలి విధుల్లో చేరాల్సి రావడం ఒకింత మానసిక అశాంతిని కలిగించే అంశం. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పు రాబోతుంది. సైనికుల పరిస్థితిని అర్థం చేసుకున్న (బీఎస్ఎఫ్) భారత సరిహద్దు దళం అధికారులు కొత్తగా పెళ్ళి చేసుకున్న సైనికులకు ఒక వెసులుబాటును కల్పించబోతున్నారు.
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఇక నుండి కొత్తగా పెళ్ళైన సైనికుడు ఏడాదిపాటు భార్యను తన దగ్గరే ఉంచుకునే అవకాశాన్ని కల్పించనుంది భారత ఆర్మీ. ఇందుకు అనుగుణంగా సరిహద్దుల్లో సైనికుల కోసం ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేయనున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలాకాలంగా ఈ డిమాండ్ ఉండడం.. కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో సైనికులు మానసికంగా ఒత్తిడికి గురవుతుండడంతో బీఎస్ఎఫ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.