న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైనల్: బీజేపీకి 350, కాంగ్రెస్ కంటే ఇతరులకే అధిక సీట్లు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. ప్రముఖ హిందీ ఛానల్ న్యూస్ 24 కోసం టుడేస్ చాణక్య ఎన్నికల సర్వే నిర్వహించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో వేలాదిమంది ఓటర్లను కలుసుకుని, వారి అభిప్రాయాలను సేకరించి, సర్వేకు తుదిరూపాన్ని ఇచ్చినట్లు వెల్లడించింది. ఆదివారం తుది దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. ఆ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించింది.
దేశంలో భారతీయ జనతాపార్టీ హవా వీస్తోందంటూ న్యూస్ 24-టుడేస్ చాణక్య స్పష్టం చేసింది. మొత్తం 543 స్థానాలకు బీజేపీ 350 సీట్ల మార్క్ను అందుకుంటుందని, ఇందులో 14 సీట్లు అటు, ఇటుగా ఉండొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా మూడంకెలను అందుకోలేదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ 90 సీట్లకే పరిమితం అవుతుందని తన తుది సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెలియజేసింది. ఇతరులకు 97 సీట్లు దక్కుతాయని పేర్కొందా సంస్థ.
అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి 65 స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో 18, ఒడిశాలో 14 స్థానాలతో ఖాతా తెరుస్తుందని తేల్చింది. దక్షిణాదిన బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తోందని పేర్కొంది. కర్ణాటక మినహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలల్లో బీజేపీ పరాభావం పాలవుతుందని టుడేస్ చాణక్య స్పష్టం చేసింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని వెల్లడించింది. హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్స్వీప్ చేయబోతోందని, దక్షిణాదిలో కొంత ఎదురుగాలి వీస్తున్నప్పటికీ.. మిగిలిన రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీని సాధించబోతుందని పేర్కొంది.