న్యూస్ 24-టుడేస్ చాణక్య: బీజేపీకే జై కొట్టిన మరాఠాలు..బిహారీలు, జార్ఖండ్
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా మరోసారి బీజేపీ హవా వీస్తోందని స్పష్టం చేసింది. హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్స్వీప్ చేయబోతోందని, దక్షిణాదిలో కొంత ఎదురుగాలి వీస్తున్నప్పటికీ.. మిగిలిన రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీని సాధిస్తోందని తేటతెల్లం చేసింది.
మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 38 సీట్లను గెలుచుకుంటుందని న్యూస్ 24- టుడేస్ చాణక్య వెల్లడించింది. బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకున్న జనతాదళ్ (యునైటెడ్) అధికారంలో ఉన్న బిహార్లో కూడా బీజేపీ హవా వీస్తోంది. బిహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. బీజేపీ 32 స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 24-టుడేస్ చాణక్య వెల్లడించింది.
మిగిలిన ఎనిమిది స్థానాలను ఇతరులు గెలుచుకుంటారని స్పష్టం చేసింది. బిహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్లో కూడా బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని తేలింది. జార్ఖండ్లో మొత్తం 14 స్థానాల్లో బీజేపీ పదింటిని తన ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది.