ముగ్గురు ఉద్యోగుల హత్య: పత్రిక ఎడిటర్కు జీవిత ఖైదు
అగర్తాలా: స్థానిక బెంగాలీ పత్రిక యజమాని, సంపాదకుడు సుశీల్ చౌధురికి స్థానిక కోర్టు ముగ్గురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు విధించింది. దీన్ని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పరిగణిస్తూ న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఇది వరకే అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి, గురువారం శిక్షను ఖరారు చేసింది.
తీర్పు ప్రతి చదువుతున్నప్పుడు 76 ఏళ్ల దైనిక్ గనదూత్ ఎడిటర్ సుశీల్ చౌధురి కోర్టులోనే ఉన్నారు. యజమానిగా, సంపాదకుడిగా తన ఉద్యోగులను రక్షించాల్సిన వ్యక్తి ముగ్గురు ఉద్యోగులు రంజిత్ చౌధురి, బలరామ్ ఘోష్, సుజిత్ భట్టాచార్జీలను చంపారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దిలీప్ సర్కార్ అన్నారు.
తనపై ఆరోపణలు విన్న చౌధురి - తాను అమాయకుడినని, వారిని ఎవరు చంపారో తెలియదని, దయచేసి తన వయస్సును పరిగణనలోకి తీసుకుని క్షమించాలని అన్నాడు. చౌధురి వారిని చంపినట్లు రుజవైందని పశ్చిమ త్రిపుర అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కృపాంకర్ చక్రవర్తి అన్నారు.
ఈ కేసులో నిజానికి దోషికి ఉరి శిక్ష విధించాలని, చౌధురి వయస్సును దృష్టిలో పెట్టుకుని చౌధురికి జీవిత ఖైదు మాత్రమే విధిస్తున్నామని ఆయన అన్నారు.
చౌధురి అక్రమ భూలావాదేవీల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటపెడతానని అతని మేనేజర్ రంజిత్ చౌధురి (61) బెదిరించినట్లు సమాచారం. దాంతో తన డ్రైవర్ బలరాం ఘోష్ సహకారంతో సుశీల్ చౌధురి రంజీత్ను హత్య చేశాడు.
మేనేజర్ హత్యను కళ్లారా చూసిన ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ (25)ని బలరామ్ ఘోష్ హత్య చేశాడు. తన మరణించడానికి ముందు సుజీత్ బలరాంను పొడిచాడు. దీంతో బలరామ్ మరణించాడు. ఆ ముగ్గురి శవాలు కూడా సుశీల్ చౌధురి కార్యాలయంలో కనిపించాయి.
గుర్తు తెలియని వ్యక్తులు ఆ ముగ్గురినీ చంపారని, నిజానికి వారు తనను చంపాలని వచ్చారని సుశీల్ చౌధురి ఓ కట్టుకథ అల్లాడు. హంతకుల ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించాడు. డ్రైవర్ భార్య నియతి ఘోష్ సహకారంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమె సాక్షి.