ఉగ్రవాది నవెద్కు సహాయం, ట్రక్ డ్రైవర్ అరెస్టు
శ్రీనగర్: భారత్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు మహమ్మద్ నవెద్ యాకూబ్, నామన్ కు సహాయం చేసిన ఓ ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.
శుక్రవారం జమ్మూలో ట్రక్ డ్రైవర్ ను అరెస్టు చేశామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఈనెల 5వ తేదిన ఓ ట్రక్ సహాయంతో ఉగ్రవాదులు మహమ్మద్ నవెద్ యాకూబ్, నామన్ లు జమ్మూలోకి ప్రవేశించారు. తరువాత ఉదమ్ పూర్ సమీపంలో వీరు ట్రక్ దిగారు.
శ్రీనగర్ హైవే మీద బీఎస్ఎఫ్ జవాన్ల మీద వీరు కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో ఇద్దరు భారత జవాన్ల ప్రాణాలు పోయాయి. అదే సందర్బంలో భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఉగ్రవాది నామన్ అంతం అయ్యాడు.
మహమ్మద్ నవెద్ యాకూబ్ ను జవాన్లు ప్రాణాలతో పట్టుకున్నారు. నవెద్ తెలిపిన వివరాల ఆధారంగా ఎన్ఐఏ అధికారులు ట్రక్ డ్రైవర్ కోసం గాలించారు. చివరికి శుక్రవారం అతనిని పట్టుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.