రక్షణ సమాచారం పాకిస్థాన్కు..: ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్, ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు
అహ్మదాబాద్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్ను గుజరాత్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రజాక్భాయ్ కుంభర్ సూపర్వైజర్గా పనిచేసినట్లు తెలిసింది.
ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన ఓ కేసు విచారణలో లభించిన ఆధారాలతో ఎన్ఐఏ సోమవారం అతడిని అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్లో పోలీసులకు చిక్కిన నిందితుడు మొహమ్మద్ రషీద్ పాకిస్థాన్కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు మనదేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది.

రెండుసార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడి అధికారులతో కూడా భేటీ అయినట్లు వెల్లడైంది. భద్రతా బలగాల కదలికలు, రక్షణశాఖ ప్రదేశాల సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఇదే కేసు విచారణలో గుజరాత్కు చెందిన రజాక్భాయ్ కుంభర్ కూడా ఐఎస్ఐ ఏజెంట్గా పని చేస్తున్నట్లు తేలింది.
ఐఎస్ఐ ఆదేశాల మేరకు అతడు రూ. 50వేలు పేటీఎం ద్వారా పంపినట్లు తెలిసింది. ఆగస్టు 27న రజాక్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications