గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడుతున్న ఎన్ఐఏ.. ఉత్తర భారతదేశంలో 50చోట్ల దాడులు.. కారణమిదే!!
గత కొంతకాలం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద కార్యకలాపాల పై, మావోయిస్టుల కార్యకలాపాలపై, గ్యాంగ్ స్టర్ లు, డ్రగ్స్ స్మగ్లర్లపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ నేడు ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాలలో 50కిపైగా ప్రాంతాలలో దాడులు నిర్వహిస్తోంది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్ స్టర్ లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాల పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
ఉత్తర భారతదేశంలో 50 చోట్ల ఎన్ఐఏ దాడులు
ఉత్తర భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఏకకాలంలో దాడులు కొనసాగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు , గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య ఉన్న సంబంధాల గుట్టు రట్టు చేసే పనిలో పడింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గతంలో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ఎన్ఐఏ దాడులు ఎందుకు నిర్వహిస్తుందంటే
జాతీయ దర్యాప్తు సంస్థ ఢిల్లీ పోలీసుల వద్ద ఇంతకుముందు నమోదైన రెండు కేసులను తిరిగి నమోదు చేసి, గ్యాంగ్స్టర్లు మరియు టెర్రర్ గ్రూపుల మధ్య సంబంధాలపై ఆగస్టు 26న దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, ఎన్ఐఏ వరుస దాడులను కొనసాగిస్తుంది. ఉగ్రవాద మరియు నేర కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న పలువురు ముఠా సభ్యులను, నాయకులను గుర్తించి ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసింది. ఇక చాలామంది గ్యాంగ్స్టర్లు భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైంది
విదేశాల నుండి కార్యాకలాపాలు నిర్వహిస్తున్న చాలా మంది గ్యాంగ్స్టర్లు
గ్యాంగ్స్టర్లు తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించటానికి సైబర్స్పేస్ను ఉపయోగిస్తున్నారని, వ్యాపారవేత్తలతో పాటు ఇతర ప్రముఖులకు బెదిరింపు కాల్స్ చేస్తూ ప్రజల మధ్య బీభత్సం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు మరియు డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ల మధ్య లోతైన కుట్ర ఉందని తేలింది. చాలామంది గ్యాంగ్ స్టర్లు పాకిస్తాన్, కెనడా, మలేషియా, ఆస్ట్రేలియా తో సహా విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇక అటువంటి ముఠాలపై మొదటిసారి మెగా రైడ్ నిర్వహించిన ఎన్ఐఏ వారిపై అణచివేతను కొనసాగిస్తోంది.
హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ నరేష్ సేథి ఇంటిపై ఎన్ఐఏ దాడులు
నేడు హర్యానాలోని ఝజ్జర్ లోని గ్యాంగ్ స్టర్ నరేష్ సేథి ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకే సేథీ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ బృందం కుటుంబ సభ్యులను విచారించి అతని ఆస్తులు, బ్యాంకు వివరాలపై దర్యాప్తు కొనసాగించారు. దాదాపు ఐదు గంటల పాటు సేథీ ఇంట్లోనే ఉన్న ఎన్ఐఏ బృందం నరేష్ సేథి అనేక హత్యలు, బెదిరింపులతో సహా క్రిమినల్ కేసులలో ఉన్నట్టు పేర్కొంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో కూడా అతనికి సంబంధం ఉందని ఎన్ఐఏ పేర్కొంది. నరేష్ సేథీ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు .