కోయంబత్తూరు పేలుడు కేసులో టర్నింగ్- NIA ఎఫ్ఐఆర్ నమోదు-ఐసిస్ లింకులతో
తమిళనాడులోని కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనలో పేలిన కారు బాంబు అనుమానాస్పదంగా ఉండటం, ఐసిస్ కు ఈ ఘటనతో సంబంధం ఉన్న అనుమానాల నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ దీన్ని ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో కేంద్రం హోంశాఖ అనుమతి తీసుకుని ఎన్ఐఏ ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దీపావళికి ముందురోజు కోయంబత్తూరులోని ఓ దేవాలయం సమీపంలో అకస్మాత్తుగా కారులో బాంబుపేలుడు జరిగింది. జమీషా ముబీన్ అనే 29 ఏళ్ల వ్యక్తి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించ్రు. అయితే పేలుడు జరిగిన విధానం, అందులో వాడిన పదార్ధాలను బట్టి చూస్తే ఇది ఐసిస్ పనేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ముబిన్ను ఉగ్రవాద సంబంధాలపై 2019లో ఎన్ఐఏ ప్రశ్నించింది. దీంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.
కోయంబత్తూర్లోని ఉక్కడం ప్రాంతంలోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో కారులో ఉన్న ఎల్పీజీ సిలండర్ పేలడంతో ముబీన్ అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదయ్యాడు. ఈ ఘటనలో పోలీసులు సోమవారం రాత్రి ఐదుగురిని అరెస్టు చేశారు. గురువారం కోయంబత్తూరులో అఫ్సర్ ఖాన్ అనే ఆరో నిందితుడిని అరెస్టు చేశారు. అతను ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా పేలుడు పదార్థాలను పంపిణీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ముబిన్ తో పాటు తాజాగా అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు 2019లో శ్రీలంకలో జరిగిన ఈస్టర్ సండే బాంబు పేలుళ్లకు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న మహ్మద్ అజారుద్దీన్తో పరిచయం ఉన్న వారే. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ముబిన్, ఇతరులు తెల్లటి గుడ్డలో చుట్టిన భారీ వస్తువులను తన ఇంటి నుండి వీధికి తీసుకువెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.