నీలేకని మానస పుత్రిక ‘ఆధార్’: మళ్లీ ఇన్ఫోసిస్ పాత్రలోకి...
దేశ పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు ప్రతిపాదించిన ఆధార్ ప్రాజెక్టు అది నందన్ నీలేకని ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ ఆలోచన, ఆయన ఆధ్వర్యంలోనే కార్యరూపం దాల్చి, విజయవంతమైంది.
హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల తరహాలో, వేలిముద్రల ఆధారంగా మన దేశ పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు ప్రతిపాదించిన ఆధార్ ప్రాజెక్టు. అది నందన్ నీలేకని ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ ఆలోచన, ఆయన ఆధ్వర్యంలోనే కార్యరూపం దాల్చి, విజయవంతమైంది.
అమోఘమైన ఆలోచనలు, సిద్ధాంతకర్త, అత్యున్నత సాంకేతిక నిపుణుడిగా, సామాజిక బాధ్యత మరువని మేధావిగా ఉన్న నందన్ నీలేకనికి 'యునిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ- ఆధార్) బాధ్యతలను నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అప్పగించారు. దేశీయ పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య, పేరు, లింగం, వయస్సు, చిరునామా, వారి వేలిముద్రలు, కనుపాపలు (ఐరిస్) ఫొటోతో సహా ప్రభుత్వం దగ్గర నిక్షిప్తం చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
అయితే వేర్వేరు మంత్రిత్వశాఖల మధ్య వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పనులు పెద్దగా ముందుకు సాగలేదు. 2014 ఎన్నికల్లో పోటీచేసేందుకు నీలేకని యూఐడీఏఐ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి, బెంగళూరు సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీచేసి, ఓడిపోయారు. 2014 మే నెలలో అధికారంలోకి ఎన్డీఏ నేతృత్వంలోని, నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా 'ఆధార్' గురించి, దాని ప్రాముఖ్యం గురించి వివరించేందుకు సమయం కోరిన నీలేకనికి ప్రధాని మోదీ సమయం ఇచ్చారు.
మోడీని ఆకట్టుకుంది...
ఆధార్ ఆవశ్యకతపై నీలేకని వివరించిన తీరు, అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికీ ధ్రువీకరణ, అవినీతి తగ్గించే వీలు, సబ్సిడీల దుర్వినియోగం అరికట్టే అవకాశం వంటివి ప్రధాని మోదీని ఆకట్టుకున్నాయి. ఆధార్ ప్రయోజనాలపై నమ్మకం, నీలేకని సామర్థ్యంపై విశ్వాసం ఉంచిన మోదీ. ప్రాజెక్టు కొనసాగేందుకు మొగ్గుచూపడం ద్వారా, దేశ విశాల ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. దేశంలోని రాష్ట్రాల్లో జనాభా లెక్కలు, ఓటర్ల జాబితాలు ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారిలో ఎక్కువమంది ఈ జాబితాల్లో ఉండేవారు కాదు. ఇక కూలీ పనుల నిమిత్తం వలస వెళ్లే కార్మికులు, నిరుపేదల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. వీరికి గుర్తింపునకు ఎటువంటి ధ్రువీకరణలు ఉండనందున, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందలేకపోయేవారు. దేశంలోని 120 కోట్ల మందికీ, ఆధార్ కార్డుల ద్వారా ప్రత్యేక ధ్రువీకరణ కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్టుల్లో అతి పెద్దది.
చిన్న బృందంతో ప్రారంభించి..
పదవి చేపట్టిన వారాల్లోనే కొద్దిమంది ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులతో చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సేకరించిన వివరాలు, అందుకు కావాల్సిన వసతులు, ప్రభుత్వాలు, సంస్థల భాగస్వామ్యం వంటివీ నిర్ణయించుకున్నారు. నీలేకని ప్రతి రాష్ట్రానికీ వెళ్లి, ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సంప్రదింపులు జరిపి, తమకు కావాల్సిన వివరాలు, సహకారం వివరించి, ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో, వారి నుంచి పూర్తి సహకారం పొందగలిగారు. అప్పటి ప్రధాని, ఆర్థిక మంత్రి ఇందుకు పూర్తి సహకారం అందించారు. 2016 నవంబర్లో పెద్దనోట్ల రద్దు అనంతరం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే చర్యల కోసం నీలేకనిని, ప్రభుత్వానికి డిజిటల్ సలహాదారుగా మోదీ ప్రభుత్వం నియమించడం ఆయన సామర్థ్యానికి మరో మచ్చుతునక.
నిలేకని సెకండ్ ఇన్నింగ్స్తో నవ్యోత్సాహం
నందన్ నీలేకని ఇన్ఫీ గూటికి తిరిగి రావడం మదుపర్లలో నవోత్సావాన్ని నింపుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. విశాల్ సిక్కా రాజీనామా అనంతర రెండు రోజుల్లో షేరు సుమారు 20% వరకు పతనమైన సంగతి తెలిసిందే. కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ.30,000 కోట్ల మేరకు ఆవిరైంది. ఆఖరుకు రూ.13,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్ కూడా షేరు పతనాన్ని నిలువరించలేకపోయింది. నందన్ నీలేకని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టొచ్చనే వార్త గుప్పుమనడంతో ఇన్ఫీ షేరు బుధ, గురువారం 5% వరకు పెరిగింది. సంస్ధ ఛైర్మన్గా నీలేకని బాధ్యతలు చేపట్టాలని మదుపర్లు ఎంతలా కోరుకుంటున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో (ఎన్వైఎస్ఈ) కంపెనీ ఏడీఆర్లు 1 శాతం వరకు పెరగడం కూడా మదుపరి సెంటిమెంటు పెరిగిందనడానికి సంకేతమని అంటున్నారు.
అప్పుడలా...
నందన్ నీలేకని గతంలో ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేసిన 2002- 2007 మధ్య కూడా కంపెనీ షేరు మదుపర్లకు అద్భుతమైన ప్రతిఫలాలను పంచింది. కంపెనీ మార్కెట్ విలువైతే 374 శాతం వరకు పెరిగింది. ఆ సమయంలో మరో ఐటీ దిగ్గజం విప్రో మార్కెట్ విలువ 110 శాతమే పెరగడం గమనార్హం. ఒక్క షేర్ విషయంలోనే కాదు ఆయన హయాంలో కంపెనీ పనితీరు కూడా ఆకర్షణీయమే. 2002- 2007 మధ్య లాభదాయాల్లో ఏటా సుమారు 40% వరకు వృద్ధి నమోదైంది. ఆ సమయంలో మిగతా ఐటీ కంపెనీలకు మించి ఇన్ఫీ రాణించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మళ్లీ ఇప్పుడు నందన్ నీలేకని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమితులైన సందర్భంగా కంపెనీకి ఆనాటి శోభ తిరిగి తీసుకొస్తారని మదుపర్లు ఆశాభావంతో ఉన్నారు. అందుకే సిక్కా రాజీనామా చేసిన మరుక్షణం నుంచే నందన్ నీలేకనిని తీసుకొని రావాలనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు.
సిక్కా రాజీనామా తర్వాత ఇలా సంక్షోభం
వికాల్ సిక్కా ఆగస్టు 18న వైదొలిగాక కంపెనీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. అదే రోజున బోర్డు ఎన్నడూ లేనివిధంగా సిక్కా రాజీనామాకు కారణం మూర్తి వ్యక్తిగత దూషణలేనని ఆరోపించింది. గత కొద్ది నెలలుగా కంపెనీలో కార్పొరేట్ పాలన విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని మూర్తి, ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్లయిన వి. బాలకృష్ణన్ వంటి వారు ఆరోపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పనయా కొనుగోలు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. మొన్నటికి మొన్న హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్, బిర్లా సన్లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ సహా డజను సంస్థాగత మదుపర్లు నీలేకనిని వెనక్కి తీసుకురావాలని బోర్డుకు లేఖ రాశారు. మూర్తికి 3%పైన, నీలేకనికి 2%పైగా వాటా ఉండడంతో బోర్డు తలొగ్గకతప్పలేదు. నీలేకని 2002-2007ల మధ్య కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో డాలర్లలో ఆదాయం 42% మేర సమ్మిళిత వృద్ధిని సాధించింది. ఆధార్ ప్రాజెక్టును అత్యంత విజయవంతం చేసిన ఘనతా ఈయనదే.కంపెనీ వృద్ధికి, క్లయింట్లను రాబట్టుకోవడానికి అది ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. క్లయింట్ల, వాటాదార్ల, ఉద్యోగులకు నీలేకనిపై విశ్వాసం ఉందని సంస్థాగత మదుపర్లు వాదించడం కూడా ఒక కారణం. దీంతో ఒక రోజు తర్వాత అంటే గురువారం రాత్రికల్లా బోర్డు ఏకగ్రీవంగా నీలేకనిని నియమిస్తూ తీర్మానం చేసింది.
పాత బోర్డు సభ్యులు ఇలా వైదొలిగారు
అమెరికా కంపెనీ ఎస్ఏపీలో వివిధ ఉన్నత స్థాయి పదవులు నిర్వర్తించిన విశాల్ సిక్కా 2014లో ఇన్ఫోసిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ఛైర్మన్గా నియమితులైనా తాజాగా కంపెనీ బోర్డు నుంచి కూడా వైదొలిగారు. ఇన్ఫోసిస్ యాజమాన్యం సిక్కాతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నది. సీఈఓగా రాజీనామా చేసిన సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా నియమించుకున్నా.. ఆ ఉద్యోగ ఒప్పందాన్ని బోర్డు రద్దు చేసింది. 90 రోజుల మూల వేతనాన్ని(2,46,575 డాలర్లు) చెల్లించి.. ఆయనను బయటకు పంపింది. చలన చెల్లింపు(వేరియబుల్ పే) 2,05,572 డాలర్లు, ఉద్యోగి ప్రయోజనాల కింద మరో 90 రోజుల వేతనాన్ని చెల్లించింది. దీంతో సిక్కాకు, ఇన్ఫోసిస్కు సంబంధాలు తెగిపోయినట్లే. 2004- 2011 మధ్య మైక్రోసాఫ్ట్ ఇండియాకు ఛైర్మన్గా పనిచేసిన రవి వెంకటేశన్ ఇన్ఫోసిస్ బోర్డులోకి అడుగుపెట్టారు. సహ ఛైర్మన్గా, స్వతంత్ర డైరక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా సహ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బోర్డులో మాత్రం కొనసాగనున్నారు. ఎన్వైయూ షాంఘై వ్యవస్థాపక వైస్ ఛాన్స్లర్గా జెఫ్రీ ఎస్ లేమాన్ ఆ తర్వాత ఛాన్స్లర్గా కూడా ఉన్నారు. పెకింగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ట్రాన్సేషనల్ లాకి వ్యవస్థాపక డీన్గానూ పనిచేశారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన జాన్ డబ్ల్యూ ఎచ్మెండీ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి హెడ్గా.. సింబాలిక్ సిస్టమ్స్ ప్రోగ్రామ్లో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్నారు. ఎక్సెలెన్స్ ఇన్ టీచింగ్ విభాగంలో డీన్, బింగ్ అవార్డులు ఆయన పొందారు. పలు పుస్తకాలను, వ్యాసాలను కూడా రాశారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆర్ శేషశాయి 2011లో ఇన్ఫీ బోర్డులోకి వచ్చారు. ఆ తర్వాత కంపెనీ ఛైర్మన్గా నియమితులయారు. ఇప్పుడు ఈ రెండు పదవులకు రాజీనామా చేశారు. హిందుస్థాన్ యునిలీవర్తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన అశోక్ లేలాండ్లో వైస్ఛైర్మన్సహా పలు కీలక బాధ్యతలను నిర్వహించారు.
సిక్కాపై సిబ్బందిలో కాన వచ్చిన అసంతృప్తి
నందన్ నీలేకని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. నారాయణమూర్తి తరవాత 2002 నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం క్రిస్ గోపాలకృష్ణన్కు ఆ బాధ్యతలు అప్పగించి, తాను ఇన్ఫోసిస్ సహ ఛైర్మన్గా 2009 జులై వరకు కొనసాగారు. తిరిగి తాజాగా మారిన పరిస్థితుల్లో నారాయణ మూర్తికి హితుడు, సన్నిహితుడిగా పేరొందిన నందన్ నిలీకని ఆ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు. తద్వారా నారాయణ మూర్తి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అనూహ్యంగా ఇన్ఫోసిస్ కొత్త ఛైర్మన్గా నందన్ నీలేకనిని నియమించడంపై కంపెనీలోని పైస్థాయి నుంచి కింద స్థాయి వరకూ అధిక శాతం మంది ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నందన్ నీలేకని మాటల మనిషి కాదని.. చేతల మనిషని చెబుతున్నారు. టెక్నాలజీపై మంచి పట్టున్న, సామర్థ్యం కలిగిన వ్యక్తన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సిక్కాపై ఎక్కువ శాతం మంది ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిక్కా వెళ్లిపోతే కంపెనీకి వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. సిక్కా కంపెనీ నుంచి బయటకు వెళతాడన్న విషయం 3 నెలల క్రితం నుంచే కంపెనీలోని ఉద్యోగులకు తెలుసని, గత నెల, నెలన్నర నుంచి సిక్కా పెద్దగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. ‘గత మూడేళ్లలో ఆయన తెచ్చిన పెద్ద మార్పులేమీ లేవు. ఉద్యోగులకు వేతనాలను పెంచలేదు. చిన్న, చిన్న కారణాలపై ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. జీరో బెంచ్ విధానం వంటివి ఆయన రాకముందు నుంచే ఉన్నాయి. నీలేకని మళ్లీ పగ్గాలు చేపడితే ఇన్ఫోసిస్కు మంచి జరుగుతుంది. అన్ని అంశాలు సర్దుకుంటాయి. ఆయనకు అంతా తెలుసు, అందుబాటులో ఉంటార'ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇప్పటి వరకూ ఉన్న సహ ఛైర్మన్ రవి వెంకటేశన్ కలిసి మూర్తిని బోర్డు నిందించడంపై తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. మూర్తికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ శేషశాయి, సహ ఛైర్మన్ రవి వెంకటేశన్ రాజీనామాలు చేయడం ఒక మంచి పరిణామమేనని అయితే.. ఇంత