కొత్త డెత్ వారెంట్: ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు: నిర్భయ దోషులకు ఉరి..!
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి అవసరమైన కొత్త డెత్ వారెంట్ శుక్రవారం సాయంత్రం జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం ఆ మేరకు డెత్ వారెంట్ను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీస్తారు. ఈ విషయాన్ని డెత్ వారెంట్లో పొందుపరిచారు.
తీహార్ జైలులో ఏర్పాట్లు..
పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి అవసరమైన ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ ఉరి తీతపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడినప్పటికీ.. తీహార్ కేంద్ర కారాగారం అధికారులు మాత్రం తమవంతు సన్నాహాలు తాము పూర్తి చేస్తున్నారు. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురినీ మూడో నంబర్ జైలుకు తరలించారు. ఆ నలుగురినీ ఉరి తీయాల్సింది ఈ జైలులోనే.
మూడో నంబర్ జైలుకు తరలింపు..
పవన్ గుప్తా, ముఖేశ్ కుమార్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మలను ఉరితీసే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. డెత్ వారెంట్ వెలువడిన తరువాత తొలిసారిగా ఈ నలుగుర కామాంధులను ఉరిశిక్షలను అమలు చేసే మూడో నంబర్ జైలు తరలించారు. వారిని వేర్వేరు సెల్స్లో ఉంచారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు.
క్షమాభిక్ష నేపథ్యంలో.. మారిన తేదీ..
ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒకవేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు దోషులకు తప్పనిసరిగా 14 రోజుల ఉపశమనం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. కొత్త డెత్ వారెంట్ను జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ను దాఖలు చేశారు.