నిర్భయ కేసు: క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు నిందితుడు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ సింగ్ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించాడు. ఇక నిర్భయ కేసులో శిక్ష పొందుతున్న నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. అయితే ఉరి శిక్ష అమలు చేయడంలో జాప్యం జరగాలనే కారణంతోనే నిర్భయ నిందితులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని తీహార్ జైలు అథారిటీ తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం ఆ తర్వాత హత్య కేసులో నలుగురు నిందితుల్లో ఇద్దరి నిందితుల తరపున వాదిస్తున్న లాయర్లు తీహార్ జైలే అధికారులపై ఆరోపణలు చేశారు. అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు తమకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు తీహార్ జైలు అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ సింగ్ తరపున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం కాగా వాటిని ఇవ్వడంలో కావాలనే జాప్యం చేస్తున్నారని నిందితుల తరపున వాదిస్తున్న లాయర్ ఏపీ సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ మధ్యనే మరో ఇద్దరు నిందితులైన వినయ్, ముఖేష్ సింగ్ల క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తీహార్ జైలు అధికారులు డాక్యుమెంట్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్న దానిపై తాము ఎలాంటి సూచనలు చేయలేమని చెబుతూ పిటిషన్ను శనివారం పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే నిందితుల తరపున వాదిస్తున్న లాయర్కు అన్ని డాక్యుమెంట్లు అందజేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం ఉరిశిక్ష అమలును జాప్యం చేయడం కోసమే వారు ఇలాంటి కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.
మరోవైపు నిందితుల్లో ఒకరు వినయ్ పై విషప్రయోగం జరిగిందని తను హాస్పిటల్లో చికిత్స పొందిన మెడికల్ రిపోర్ట్స్ను తమకు ఇవ్వడం లేదని నిందితుల తరుపున లాయర్ ఏపీ సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలు అధికారులు శుక్రవారం రాత్రి తనకు కొన్ని డాక్యుమెంట్లు అందజేశారని అయితే అందులో వినయ్ వ్యక్తిగత డైరీ, ఇతర మెడికల్ డాక్యుమెంట్లు లేవని చెప్పారు. జైలులో శిక్ష పొందుతున్న సమయంలో వినయ్ పలు పెయింటింగ్స్ వేశాడని ఆ పెయింటింగ్స్ను అమ్మడం ద్వారా ఎంత డబ్బు వచ్చిందో రాష్ట్రపతికి తెలపాలనుకున్నట్లు ఏపీ సింగ్ చెప్పారు. ఇక మరో నిందితుడు పవన్ సింగ్ తలకు గాయమైందని హాస్పిటల్కు తరలించగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదని చెప్పారు.