ఒకే తరహా నేరం..ఒకే తరహా శిక్ష.. వేర్వేరుగా అమలు ఎలా?: ఉరిశిక్ష తేదీపై స్టే కోరుతూ పిటీషన్..!
Recommended Video
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు గురువారం అనూహ్యంగా మలుపు తిరిగింది. మరో 48 గంటల్లో ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నిలిపివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయకూడదని, స్టే విధించాలని కోరుతూ ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ను దాఖలు చేశారు.

ఒకే తరహా కేసు..ఒకే తరహా శిక్ష.. వేర్వేరుగా అమలు ఎలా?
నిర్బయపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వినయ్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముఖేష్ కుమార్ సింగ్ తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ఒకే కేసులో, ఒకే తరహా శిక్ష పడిన నలుగురు దోషులకూ వేర్వేరుగా శిక్షలను అమలు చేయకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పిటీషన్లో పొందుపరిచారు. ఢిల్లీ కారాగార నిబంధనలకు ఇది విరుద్ధమని వెల్లడించారు.

ఢిల్లీ కారాగార నిబంధనలకు విరుద్ధం..
చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు తొలగిపోయిన తరువాతే శిక్షను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ కారాగార నియమ, నిబంధనలు ఇదే విషయాన్ని ఉటంకిస్తున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్లను ఆయన పిటీషన్లో పొందుపరిచారు. కొన్ని కాపీలను ఆయన పిటీషన్కు జత చేశారు. ఈ పిటీషన్ను పటియాలా హౌస్ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష తేదీలను ఖరారు చేస్తూ ఇదివరకు డెత్ వారెంట్ను జారీ చేసిన న్యాయస్థానం కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్యురేటివ్ పిటీషన్పై విచారణ..
ఇదిలావుండగా.. అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటీషన్పై సుప్రీంకోర్టు మరి కాస్సేపట్లో విచారణకు స్వీకరించబోతోంది. జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టనుంది. తాను ఎదుర్కొంటున్న ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించాలని కోరుత అక్షయ్ ఠాకూర్ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై అతని తరపున ప్రముఖ న్యాయవాది అంజనా ప్రకాశ్ వాదనలను వినిపించనున్నారు.












Click it and Unblock the Notifications