Nirbhaya Case: కేంద్రం పిటిషన్పై తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా నలుగురు దోషులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టనుంది. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం కూడా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, నిర్భయ దోషులు తమ ఉరిశిక్ష అమలు కాకుండా ఉద్దేశ్వపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని కేంద్రం మండిపడింది.
కాగా, ఇటీవల హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురు దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని, న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్నారని కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు.
నిర్భయ దోషులకు వేర్వేరుగా శిక్ష అమలు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. 2012లో నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తుషార్ మెహతా గుర్తు చేశారు. పవన్ గుప్తా అనే దోషి ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదనీ.. కావాలనే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు వివరించారు.
దోషుల తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు ఉంచింది. కాగా, నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దోషులు వేసిన పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉన్నందున వారికి శిక్షను అమలు చేయడం కుదరదని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ శిక్షను అమలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్పందిస్తూ.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది.