నిర్భయ కేసు : నేడు పవన్ గుప్తా పిటిషన్పై సుప్రీం విచారణ.. ఉరి మరోసారి వాయిదా తప్పదా?
నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా(25) దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషనన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. న్యాయమూర్తులు ఎన్వీ రమణ,అరుణ్ మిశ్రా,ఆర్ఎఫ్ నారిమణ్,ఆర్ బానుమతి,అశోక్ భూషణ్ నేత్రుత్వంలోని ధర్మాసనం జస్టిస్ రమణ ఛాంబర్లో పిటిషన్పై విచారణ జరపనుంది. నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్ని అని.. దాన్ని పరిగణలోకి తీసుకుని తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని పవన్ గుప్తా తన పిటిషన్లో పేర్కొన్నాడు.
Recommended Video
నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్(32),వినయ్ కుమార్ శర్మ(26),అక్షయ్ కుమార్(31) ఇప్పటికే న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు. అయితే వీరిలో అక్షయ్ కుమార్ మాత్రం క్షమాభిక్ష తిరస్కరణపై ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఇక దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా ఒక్కడే ఇప్పటివరకు ఎలాంటి న్యాయ అవకాశాన్ని వినియోగించుకోలేదు. మరణశిక్షను వాయిదా వేసేందుకే దోషులు ఇలా వేర్వేరుగా పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిర్భయ దోషులకు ఇప్పటికే రెండుసార్లు శిక్ష వాయిదాపడింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ పటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం మార్చి 3న ఉదయం 6గంటలకు నలుగురు దోషులనూ ఉరితీయాల్సి ఉంది.
పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ నేపథ్యంలో మరోసారి నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. క్యురేటివ్ పిటిషన్ తర్వాత అతను రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ తిరస్కరణకు గురైతే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించవచ్చు. ఇదంతా ఒక్కరోజులో జరిగిపోయే వ్యవహారం కాదు. కాబట్టి నిర్భయ దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.