చివరి అవకాశం: నిర్భయ దోషులకు వారం గడువు, న్యాయ ప్రక్రియకు ఢిల్లీ హైకోర్టు సమయం
నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యంపై కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష నిలిపివేసే ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. అలాగే దోషులకు విడివిడిగా శిక్ష అమలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఒకేసారి శిక్ష అమలు చేయాలని అభిప్రాయపడింది.

హైకోర్టుకు..
నిర్భయ కేసులో ముఖేశ్ కుమార్ సింగ్ రాష్ట్రపతి, కోర్టుల ప్రక్రియ ముగిసింది. వినయ్, అక్షయ్.. పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 1వ తేదీన విధించాల్సిన ఉరిశిక్షను కోర్టును వాయిదా వేసింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఉరి శిక్ష అమలు చేయబోమని తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని.. పవన్ అనే దోషి ఇంకా న్యాయ ప్రక్రియ చేపట్టలేదని పేర్కొన్నది. ఈ కేసులో వాదోపవాదనలు విన్న ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. నిర్భయ దోషులు వారం రోజుల్లో ఉరిశిక్ష నిలిపివేతకు సంబంధించి ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలిచ్చింది.

వారంలో..
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై మరో వారం రోజుల సమయం మాత్రమే దోషులకు సమయం మిగిలి ఉంటుంది. ఈ తీర్పును పాటియాలా హౌస్ కోర్టు అనుసరించి.. అమలు చేస్తే మరో వారం రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. లేదంటే మరో తేదీని ప్రకటించి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీస్తారు.

ఇదీ కేసు నేపథ్యం..
2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత దోషులు పాటియాలా కోర్టును ఆశ్రయించడంతో ఫిబ్రవరి 1వ తేదీన విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వారం రోజుల్లో దోషులు న్యాయ ప్రక్రియ పొందే వెసులుబాటు కలిగింది.












Click it and Unblock the Notifications