పూర్వపరాలు: నిర్భయపై ఆరోజు రాత్రి ఘోరం జరిగిందిలా..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు శుక్రవారం నిర్భయ హంతకులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడాన్ని దేశయావత్తూ హర్షం వ్యక్తం చేస్తోంది. నిర్భయ పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులపై సానుభూతి చూపలేమని సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్భయ ఘటన 16 డిసెంబర్ 2012 న భారత రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా ఇనుప కడ్డీలతో కొట్టి అత్యాచారం చేశారు. నిందితుల దాడిలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె శరీరంలోపలి భాగాలు, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆ రోజు సాయంత్రం
23 ఏళ్ళ వైద్య విద్యార్థి(నిర్భయ), ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు(16డిసెంబర్, 2012) సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా మద్యం సేవించి ఉన్నారని, వారంతా ఒకరికొకరు తెలిసినవారే.
కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఏం చేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు.

దురుసుగా ప్రవర్తించి..
ఆ తర్వాత నిర్భయతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని తలపైన ఇనుప రాడ్తో కొట్టారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లాడతను. ఆపై ఒంటరిగా ఉన్న నిర్భయను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు.

అత్యంత పాశవికంగా..
ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ను పలుమార్లుచొప్పించారు. ఆ తర్వాత కూడా ఆరుగురు దుర్మార్గులు ఒక్కొక్కరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరమంతా బస్సు కడులుతుండగానే జరిగింది. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్నా.. ఆమెపై అత్యాచారాన్ని రాక్షసంగా కొనసాగించారు. సుమారు గంటకు పైగా హింసించి, ఆ తర్వాత ఆమెను వివస్త్రగానే రోడ్డు పైకి విసిరివేశారు. ఆమె స్నేహిడిని కూడా రోడ్డుపై పడేశారు.

చలించిన వైద్యులు
ఆమె శరీరంలో ఇనుప రాడ్ చొప్పించడం మూలంగా ఉదరంలో, పేగులలో, మర్మాంగాలలో తీవ్రంగా దెబ్బలు తగిలాయని నిర్భయకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు. ఆమె ఈ చిత్రహింసలను ఎలా భరించిందో అంటూ చలించిపోయారు. కాగా, ఆ తరువాతి రోజు పోలీసు పరిశోధనలో ఆ ఇనుపరాడ్ తుప్పుపట్టి L ఆకారంలో ఉన్నదిగా తెలిపారు.

గమనించిన గస్తీ సిబ్బంది
రాత్రి 11 గంటలకు వివస్త్రగా, అచేతనంగా పడివున్న వారి(నిర్భయ, ఆమె స్నేహితుడు) గురించి కొందరు తెలుపగా.. గస్తీ సిబ్బంది వారిని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వారు అత్యవసర చికిత్స చేసి ఆమెను వెంటిలేటర్ లో పెట్టారు. డాక్టర్లు పరీక్షించగా ఆమెలో ఉండవలసిన పేగులు కేవలం 5% మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఉన్మాదులు ఆ రాడ్ ఆమె లోనికి చొప్పించి బలంగా బయటకు లాగటం మూలంగా ఆమె పేగులు బయటకు వచ్చినట్లు తెలిపారు.

నిర్భయ తుది శ్వాస విడిచింది
2012 డిసెంబర్ 26న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేపట్టిన కేబినెట్ మీటింగ్లో నిర్భయను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కాగా, 28 డిసెంబర్ 2012 న నిర్భయ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. డాక్టర్లు ఆమె ప్రాణాలతో పోరాడుతుందని తెలిపారు. ఆరోగ్యం మరింత విషమించడంతో 29 డిసెంబర్ 2012 న ఉదయం 4:45గంటలకు నిర్భయ తుది శ్వాస విడిచారు.

నిందితులను గుర్తించిన నిర్భయ స్నేహితుడు
21 డిసెంబర్ 2012న బాధితురాలు ఆమె వాంగ్మూలాన్ని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో సబ్ డివిజనల్ న్యాయాధికారికి, పోలీస్ డిప్యూటీ కమిషనర్ ముందు తెలిపారు. డిసెంబర్ 19న నిర్భయ స్నేహితుడు నిందితులను గుర్తించారు. దీంతో నిర్భయ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు అరెస్ట్ ఇలా..
రామ్ సింగ్(బస్సు డ్రైవరు), అతని తమ్ముడు ముకేష్ సింగ్లను రాజస్తాన్లో అదుపులోకి తీసుకున్నారు. వినయ్ శర్మ(జిమ్ ఇన్స్ట్రక్టర్)ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే పవన్ గుప్తా(పండ్ల వ్యాపారి)ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు, మైనర్ బాలుడైన రాజును ఉత్తరప్రదేశ్లో ఆనంద్ విహార్ టెర్మినల్లో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ను బీహార్లోని ఆరంగాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఆ రోజు తప్ప తాగి బస్సులో ఢిల్లీలో తిరిగారు.
రాజు ఆ రోజే వారందరినీ కలిశాడు. రామ్ సింగ్ ను 18 డిసెంబర్ 2012 మహానగర న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ముకేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న తరువాత జైలు సహచరులు అతనిని కొడుతున్నందున తీహార్ జైలులో ప్రత్యేక గదిలో ఉంచారు. గుప్తాను అదుపులోకి తీసుకున్న తరువాత అతను తన నెరాన్నీ అంగీకరించి తనను ఉరితీయాలని కోరాడు.

ఉరి ఖరారు చేసిన సుప్రీం
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం(మే 5,2017న ) సమర్థించింది. నిందితుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ నిర్భయ ఘటనలో నిందితులు బాధితురాలి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారని, వారిపై ఎలాంటి సానుభూతి చూపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్లకు ఉరిశిక్ష అమలు కానుంది.

దేశం హర్షించింది
నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష ఖరారు చేయడంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. సుప్రీం తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కూతురుకు ఈ తీర్పుతో న్యాయం జరిగిందని వారన్నారు. కాగా, ఉత్తర ప్రదేశ్లోని బాల్లియా జిల్లాకు చెందిన నిర్భయ తల్లిదండ్రులు చాలా కాలం నుంచీ ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. కాగా, నిర్భయ ఢిల్లీలోనే పుట్టి పెరిగారు.












Click it and Unblock the Notifications