బడ్జెట్ పై నిర్మల రియాక్షన్- సమతౌల్యంగా ఉంది, కొత్త పన్ను విధానంపై ఒత్తిడి చేయం..
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తాను పార్లమెంట్ లో సమర్పించిన బడ్జెట్ ను సమర్ధించుకున్నారు. బడ్జెట్ పై మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో ఇవాళ వరుసగా ఐదో ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బడ్జెట్ లో తాను తీసుకొచ్చిన మార్పుల్ని సమర్ధించుకున్న నిర్మల.. ముఖ్యంగా ఆదాయపన్ను మదింపులో తీసుకొచ్చిన విధానం ఆకర్షణీయంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇవాళ తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాల్ని మరింత వివరంగా వెల్లడించేందుకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో బడ్జెట్ ద్వారా తాను ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నదీ వివరించారు. బడ్జెట్ ద్వారా తాము మహిళా సాధికారత కోసం ప్రయత్నించామని నిర్మల తెలిపారు. ఈ బడ్జెట్ అందంగా సమతుల్యంగా ఉందన్నారు. మధ్యతరగతి వర్గానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు. భారతదేశం పారిశ్రామిక విప్లవం వైపు పయనిస్తోందని, పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచాలని చూస్తున్నట్లు నిర్మల వెల్లడించారు.
ఇవాళ ప్రకటించిన కొత్త ఆదాయ పన్ను విధానం ఇప్పుడు మంచి ప్రోత్సాహకాలు అందించేలా ఆకర్షణీయంగా ఉందని ఆర్ధికమంత్రి తెలిపారు. తద్వారా ప్రజలు నిస్సందేహంగా పాత నుండి కొత్త మార్పుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని, కానీ కొత్త విధానం అయితే ఆకర్షణీయంగా ఉందని నిర్మల చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది ఎక్కువ రాయితీలను ఇస్తుందన్నారు.
10వేల కోట్ల వార్షిక కేటాయింపులతో టైర్ -2, టైర్ -3 నగరాల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యుఐడిఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యుఐడిఎఫ్ లో వినియోగదారుల నుంచి తగిన ఛార్జీలు వసూలు చేసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, అలాగే ఇప్పటికే ఉన్న పథకాల నుండి వనరులను పొందేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మల తెలిపారు.
తన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని నిర్మల తెలిపారు. సమ్మిళిత అభివృద్ధికి సంబంధించి పునాదిని బలోపేతం చేయడం, చివరి మైలుకు చేరుకోవడం, ఆర్థిక సాధికారతపై దృష్టి పెట్టినట్లు ఆమె వెల్లడించారు.సాంకేతికత, కృత్రిమ మేథ, డేటా గవర్నెన్స్ విధానం, సరళీకృత కేవైసీ ప్రక్రియ, సాధారణ వ్యాపార గుర్తింపు, సూక్ష్మమధ్య పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన పెట్టుబడులు కొన్ని కీలకమైన బీమా కంపెనీలు ముందుకు వెళ్లేందుకు ఉపకరిస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని విస్తరించడం వల్ల పన్ను చెల్లింపుదారుల చేతిలో అదనపు ఆదాయం కూడా వినియోగాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. మొత్తంమీద ఇది చాలా సమతుల్య బడ్జెట్ అన్నారు.