నా కొడుక్కు ఏం తక్కువ..ఆమెకు ఎలా కేబినెట్లో చోటు కల్పించారు: నిషద్ పార్టీ చీఫ్
ప్రధాని మోడీ తాజాగా విస్తరించిన తన కేబినెట్లో పలువురు ఆశావహులకు చోటు దక్కకపోవడంతో బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దల్(నిషద్ ) పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ కేబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమారుడు బీజేపీ ఎంపీ ప్రవీణ్ నిషద్కు కేబినెట్లో చోటు దక్కుతుందన్న ఆశ అడియాస అవడంతో సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అప్నాదల్ పార్టీకి చెందిన అనుప్రియ పటేల్కు కేబినెట్లో చోటు దక్కినప్పుడు తన కొడుకుకు ఏం తక్కువని మంత్రివర్గంలో చోటు కల్పించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే నిషద్ సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీకి దూరం అవుతున్నారని, కమలం పార్టీ తన తప్పులను సరిదిద్దుకోలేకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే ప్రవీణ్ నిషద్కు 160 సీట్లలో మంచి పాపులారిటీ ఉందని చెప్పిన సంజయ్ నిషద్... అనుప్రియ పటేల్కు అతి తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పాపులారిటీ ఉందని చెప్పారు. అయితే తన అభిప్రాయంను ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇక వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పిన నిషద్.. వారిపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. తన కొడుకు ప్రవీణ్ నిషద్ భవిష్యత్తుకు వారు భరోసా ఇస్తారన్న నమ్మకం తనకుందని సంజయ్ నిషద్ చెప్పుకొచ్చారు.
ఇదంతా అటుంచితే నిషద్ పార్టీకి ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మరోవైపు ప్రవీణ్ నిషద్ సంత్ కబీర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018లో సీఎం యోగీ ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్కు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ బలపర్చిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రవీణ్ నిషద్ అక్కడ నుంచి గెలుపొందారు. ఇందుకు బీఎస్పీ కూడా సహకరించింది. ఆ తర్వాత అంటే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకుని సంత్ కబీర్ నగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
కొన్ని రోజుల క్రితం బల్లియాలో సంజయ్ నిషద్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమ ప్రయాణం కొనసాగుతుందని భవిష్యత్తులో కూడా బీజేపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే నిషద్ సామాజికవర్గం మాత్రం బీజేపీకి దూరం అవుతోందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీలు నిషద్ సామాజిక వర్గంను మోసం చేశాయని... ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేస్తోందన్న భావనలో ఆ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారని సంజయ్ నిషద్ పేర్కొన్నారు.