దద్దరిల్లుతున్న ఇరాన్- పశ్చిమాసియా భీకరం
పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వంద రోజుల సుదీర్ఘ పోరాట ఉద్రిక్తతల క్రమంలో ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తాజాగా భారీ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడులతో టెహ్రాన్తో సహా పలు కీలక నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సైనిక ఘర్షణ, ప్రాంతీయ భద్రతను ప్రమాదంలో పడేయడమే కాకుండా.. నూతన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) తెలిపిన వివరాల ప్రకారం, రాజధాని టెహ్రాన్లో శక్తిమంతమైన పేలుళ్లు వినిపించాయి. ఇస్ఫాహాన్లో కూడా పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇరాన్ అధికారిక బ్రాడ్ కాస్టింగ్ సంస్థ ఐఆర్ఐబీ ఈ దాడుల నిర్ధారించింది. టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫహాన్ నగరాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ఇరాన్ స్వయంగా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసిన కొద్దిసేపటికే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఎదురుదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) స్పందించింది. ముప్పును నివారించేందుకు వైమానిక దళం కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపింది. శత్రువుల నుంచి వచ్చిన క్షిపణి ప్రయోగాలను సమర్థవంతంగా తిప్పికొట్టామని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేసింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు.
ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, నెలకొన్న అతిపెద్ద సంక్షోభం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లెబనాన్లోని హెజ్బొల్లా సంస్థపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు నిరసనగానే తాము క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ సుప్రీం నాయకుడి సైనిక సలహాదారు మోహ్సెన్ రెజాయీ పేర్కొన్నారు. అంతకుముందు రోజు జరిగిన ఉద్రిక్తతల్లో, లెబనాన్లోని బీరూట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు మరణించగా, 11 మంది గాయపడ్డారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇరాన్ దాడుల తర్వాత ఆయన ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ, తన పరిపాలన దౌత్యమార్గంలో పరిష్కారం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తీసుకునే ప్రతీకార చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిర్ణయాలు కూడా తన ఆదేశాల మేరకే ఉంటాయని ట్రంప్ తేల్చిచెప్పారు.
హెజ్బొల్లాతో ఘర్షణ, తాజా క్షిపణి దాడులు కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను ప్రమాదంలో పడేశాయి. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు, హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య మార్గాల పునరుద్ధరణ వంటి కీలకాంశాలు నీరుగారేలా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఎత్తుగడలు మున్ముందు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠత రేపుతోంది.












Click it and Unblock the Notifications