'ఢిల్లీ మహిళలను పట్టించుకోరు గానీ.. నీతాకు మాత్రం..' : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : మహిళా భద్రత విషయంలో ప్రధాని మోడీ వ్యవహరిస్తోన్న తీరును తప్పుబట్టారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పారిశ్రామికవేత్తయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి వై కేటగిరి భద్రత కల్పించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేజ్రీవాల్.
నీతా అంబానీ లాంటి స్నేహితులకు భద్రతను కల్పించే మోడీ, ఢిల్లీ మహిళల భద్రతను మాత్రం పట్టించుకోరని ఆరోపించారు. నీతా అంబానీకి వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించిన నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా సీఎం కేజ్రీవాల్ స్పందించిన ఈ వ్యాఖ్యలు చేశారు.
Women raped daily in Delhi. No security for them despite repeated requests. But PM providing security to his friends pic.twitter.com/g08fWg0lRd
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 26, 2016
ఢిల్లీలో మహిళా భద్రతకు సంబందించి.. మహిళలకు రక్షణ కల్పించాలని కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని, అయితే తన స్నేహితులకు మాత్రం ప్రధాని మోడీ భద్రత కల్పిస్తున్నారని విమర్శించారు.
నిత్యం అత్యాచారాలు చోటు చేసుకునే ఢిల్లీలో మహిళా భద్రతను పట్టించుకోకుండా.. నీతా అంబానీ లాంటి వ్యక్తులకు భద్రతను కేటాయించడాన్ని తప్పుబట్టారు. నీతాకు భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి జెడ్ కేటగిరి భద్రత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. జెడ్ కేటగిరీలో 22మంది సెక్యూరిటీ రక్షణగా ఉంటే.. వై కేటగిరీలో 11మంది సెక్యూరిటీ రక్షణను కల్పిస్తారు.