విద్యాసాగర్ రావు సహా రోడ్లూడ్చిన నీతా అంబానీ
ముంబై: రిలయన్స్ అధినేత సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు, నీతా అంబానీతో కలిసి శనివారం ముంబైలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నీతా అంబానీ, విద్యాసాగర రావుతో కలిసి ముంబై రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు. మహారాష్ట్రలో స్వచ్ఛ బారత్ కార్యక్రమానికి మోడీ నియమించిన తొమ్మిది మంది గుడ్ విల్ అంబాసిడర్లలో నీతా అంబానీ ఒకరు.
ముంబైలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని గవర్నర్ విద్యాసాగర రావు అన్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. నగరవాసులతో పాటు ఎన్జీవోలు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వచ్ఛ భారత్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని నీతూ అంబానీ చెప్పారు. ఇది గొప్ప ఉద్యమమని, దీనివల్ల పరిశుభ్రతా సంప్రదాయం, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతాయని ఆమె అన్నారు.
రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాల పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలని విద్యాసాగర రావు అన్నారు. పారిశుద్ధఅయ కార్యక్రమంలో పాల్గొనడానికి తాను జెజె ఆస్పత్రికి కూడా వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు భాగస్వాములు అయ్యే విధంగా ప్రచారం చేపట్టాలని తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముంబై నగర పాలక సంస్థ కమిషనర్కు సూచించినట్లు ఆయన తెలిపారు.
ఇంతకు ముందు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.