''ఏదో ఒకరోజు చీకటి తొలగిపోతుంది'': నితిన్ గడ్కరీ
భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డులో ఇటీవలే చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయీ, అద్వానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి అగ్రనేతల కృషి వల్లే బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయికి ఎదిగిందన్నారు. బీజేపీ 1980లో ముంబయిలో నిర్వహించిన సదస్సులో వాజ్ పేయీ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా గడ్కరీ గుర్తుచేసుకున్నారు.
ఏదో ఒకరోజు చీకటి తొలగిపోతుందని, సూర్యుడు బయటకు వస్తాడని, కమలం వికసిస్తుందని ఆరోజు వ్యాఖ్యానించారు. ఆ సదస్సులో తాను కూడా ఉన్నానని, ఆరోజు వాజ్ పేయీ ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి ఒకరోజు వస్తుందని బలంగా నమ్మారని చెప్పారు. అటల్, అద్వానీ, దీన్ దయాళ్ తదదితర కార్యకర్తలు విశేషంగా కృషిచేయడంవల్లే మనం మోడీ నాయకత్వంలో అధికారంలో ఉన్నామని గడ్కరీ అన్నారు.

ప్రస్తుతం అధికారమే కేంద్రంగా రాజకీయాలు కొనసాగుతున్నాయన్న వ్యాఖ్యలపై స్పందించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, దివంగత దత్తోపంత్ ఠెంగడీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలంటే సమాజ, ఆర్థిక సంస్కర్తలు మాత్రం చాలా ముందుచూపుతో వచ్చే శతాబ్దం గురించి కూడా ఆలోచిస్తారని చెప్పారంటూ గడ్కరీ అన్నారు. ఈ విషయాన్ని ఠెంగడీ పదే పదే చెబుతుండేవారని చెప్పారు.












Click it and Unblock the Notifications