ప్రధాని మోడీతో సీఎం నితీశ్ భేటీ: ముందస్తు సహా కీలక ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందుగా ప్రధానితో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో నితీశ్ కుమార్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ పాత్ర ఏంటనేదానిపైనా చర్చినట్లు సమాచారం.

మరో కీలక అంశం ఏమిటంటే.. బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ప్రధాని మోడీతో నితీశ్ చర్చించినట్లు సమాచారం. సార్వత్రికి ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏకు మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో తమ కూటమిపై ప్రజలు సానుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ ఆలోచినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది ఇలావుంటే, బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారంటూ మరో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై నితీశ్ ప్రధానితో చర్చించినట్లు మరో వార్త ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఈ అంశంపై జూన్ 10న బీహార్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీటిలో దేనిపైనైనా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications