ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ తప్పుకోనున్నారా...?
బీహార్లో త్వరలో ఓ టాప్ పోస్టు ఖాళీ కానుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎల్ఎస్పీ నేత కేంద్ర మంత్రి ఉప్పేంద్ర కుశ్వాహా. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయాల్లో అన్ని పదవులను అనుభవించి ప్రజలకు మెరుగైన పాలన అందించారనే తృప్తితో ఉన్నారన్నారు. త్వరలో తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారని సంచలన విషయాలను వెల్లడించారు. అదే సమయంలో తను సీఎం పదవికి రాజీనామా చేయరని ఎవరూ నితీష్ను పదవి నుంచి తప్పుకోమని బలవంతం చేయలేరని చెప్పారు.
నితీష్ తన పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు
పాట్నాలో తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన విషయాలను కుశ్వాహా వెల్లడించారు. అంతేకాదు తనకు తెలిసినంతగా నితీష్ కుమార్ మరెవరికీ తెలియదని కుశ్వాహా చెప్పారు. ఇప్పటికే 15 ఏళ్లు పదవిని అనుభవించిన నితీష్ కుమార్ ఇక దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే కుశ్వాహా చేసిన వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ కానీ లేదా జేడీయూ పార్టీ వారు కానీ స్పందించలేదు. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా సీఎం నితీష్ జేడీయూ పార్టీపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు కుశ్వాహా. ఇరు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ వారిమధ్య విభేదాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ, జేడీయూ పార్టీలు రాష్ట్రంలో సమాన సీట్లలో పోటీ చేస్తూ కుశ్వాహాను అంతగా పట్టించుకోకపోవడమేనని అక్కడి రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
గతంలో మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్
ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించకూడదని బీహార్లో ఎన్డీఏ కూటమికి చెందిన ఓ నేత చెప్పినట్లు కుశ్వాహా గతనెలలో బాంబు పేల్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన నేత పేరు చెప్పేందుకు నిరాకరించారు. అయితే ఇది పరోక్షంగా నితీష్ కుమార్ గురించే చెప్పినట్లు తెలుస్తోంది. 2013లో ప్రధాని అభ్యర్థిగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని నితీష్ కుమార్ వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు.
నితీష్-అమిత్ల ఒప్పందంపై అసంతృప్తితో కుశ్వాహా
బీహార్లో 2019 ఎన్నికలకు సమానమైన సీట్లలో పోటీ చేస్తామని గతవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఉప్పేంద్ర కుశ్వాహా ఆర్జేడీ నేత మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ను కలవడం చర్చనీయాంశమైంది. అంతకంటే ముందు రామ్విలాస్ పాశ్వాన్ను కూడా కలిశారు కుశ్వాహా. ఇలా కలవడం ద్వారా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీలు నితీష్ కుమార్-అమిత్షా ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న సంకేతాలు పంపకనే పంపారు. ఇదిలా ఉంటే పాశ్వాన్ పార్టీ ఏడు సీట్లను బీహార్లో డిమాండ్ చేస్తోంది.
2014లో నితీష్ పార్టీకంటే మా పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి
ఇక పొత్తులో భాగంగా ముందుగా నితీష్కే ప్రాధాన్యం ఇచ్చారు అమిత్ షా. దీంతో కుశ్వాహా, పాశ్వాన్లు ఇద్దరు చెరో సీటు కోల్పోవాల్సి వస్తోంది. ఇది కుశ్వాహాకు మింగుడు పడటం లేదు. 2014లో నితీష్ పార్టీ కంటే తన పార్టీ ఆర్ఎస్ఎల్పీనే ఎక్కువ సీట్లు నెగ్గిందని గుర్తు చేశారు. జేడీయూ రెండు సీట్లు గెలవగా.. కుశ్వాహా పార్టీ మూడు సీట్లలో విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం కుశ్వాహా పార్టీకి రెండు సీట్లనే బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం.