మోడీ, అమిత్ షా వ్యూహాలను తిప్పికొట్టిన నితీష్కుమార్... శరవేగంగా పావులు
2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమకన్నా తక్కువ సీట్లున్న జేడీయూ నేత నితీష్కుమార్ను ముఖ్యమంత్రిని చేయడం వెనక భారతీయ జనతాపార్టీ నేతల వ్యూహం దాగివుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి ఎవరితో పొత్తుల్లేకుండా సింగిల్ గాఅధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యంగా ఉంది. దీనిలో భాగంగానే ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా జేడీయూను దెబ్బతీసి బీజేపీ ముఖ్యమంత్రి తెరపైకి వచ్చే అవకాశం ఉందని నితీష్కుమార్ భావించారు. కమల దళం కదలికలపై అనుమానం వచ్చిన వెంటనే శరవేగంగా పావులు కదిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్తో కూటమి కట్టారు.
అనుమానాలకు బలం చేకూర్చిన సంఘటనలు
తనకున్న ప్రజాదరణను దెబ్బతీసి ఏ క్షణంలోనైనా బీజేపీ ముఖ్యమంత్రి తెరపైకి రావడానికి జరిగిన కొన్ని సంఘటనలు నితీష్ అనుమానాలకు బలం చేకూర్చాయి. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా బీజేపీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ విజయ్కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తప్పించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ నితీష్ విజయవంతం కాలేకపోయారు.
అంతేకాకుండా 2019 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎన్డీయే కేబినెట్లో తమ పార్టీకి ఒక్కటే మంత్రి పదవి ఇస్తామంటే నితీష్ తిరస్కరించారు. 2021లో మళ్లీ మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు తాను చెప్పిన పేరు కాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్సీపీ సింగ్కు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
చిరాగ్ పాశ్వాన్ కు బీజేపీ మద్దతుపై..
ఆర్సీపీ సింగ్ బీజేపీతో సన్నిహితంగా మెలగడం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అసలు ఇష్టంలేదు. దీంతో రాజ్యసభ పదవీ కాలం ముగిసినప్పటికీ ఆయనకు సభ్యత్వాన్ని పొడిగించలేదు. దీంతో సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన నితీష్ పై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు జేడీయూకు రాజీనామా చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను ఓడించడమే లక్ష్యంగా లోక్ జనశక్తి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పనిచేశారు. ఆయనకు బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందని నితీష్ అనుమానించారు.
Recommended Video
మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే స్వేచ్ఛ లేదు
తన మంత్రివర్గంలోకి బీజేపీ ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలన్న స్వేచ్ఛ నితీష్ కు లేదు. బీజేపీ పెద్దలు ఇచ్చిన పేర్లనే తీసుకోవాల్సి వచ్చింది. అధిక మంత్రి పదవులు కమలానికే దక్కాయి. దీంతో 2024 ఎన్నికల తర్వాత తనను బీజేపీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనివ్వదని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆర్ సీపీ సింగ్ ద్వారా కేంద్రం తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తోందని అనుమానించి ముందు జాగ్రత్తగా ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ తో దోస్తీ కట్టారు.