ఓటమి:బిజినెస్ చేద్దామనుకున్ననితీష్, భార్య పర్మిషన్
పాట్నా: ఎన్నికల్లో రెండుసార్లు ఓడిన అనంతరం.. జెడీయు ముఖ్యనేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాపారం చేద్దామని ఆలోచించారు. ఈ విషయాన్ని ఓ పుస్తకం వెల్లడిస్తోంది. 1977, ఆ తర్వాత 1980లో వరుసగా పరాజయాల అనంతరం ఆయన వ్యాపారం చేయాలని భావించారు.
వరుస పరాజయాల నేపథ్యంలో నితీష్ కుమార్... 'ఇలా అయితే ఎలా! పరిస్థితి చూస్తుంటే నేనేదైనా వ్యాపారం చూసుకోవాలనుకుంటా'నని తన ఆప్తమిత్రుడైన మున్నా సర్కార్తో చెప్పుకున్నారట. సంతోష్ సింగ్ అనే పాత్రికేయుడు రాసిన 'రూల్డ్ ఆర్ మిస్రూల్డ్' అనే పుస్తకం ఈ విషయాలన్నిటినీ వెల్లడించింది.
నితీష్ పరాజయాలు చూసి ఆయన కుటుంబం ఓ దశలో అసహనం చెందిందని, ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నందున.. ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుననే అభిప్రాయాలూ వెల్లడయ్యాయి. చివరకు నితీష్ తన భార్య మంజుతో మనసులో బాధంతా చెప్పుకొచ్చారని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఆఖరి అవకాశాన్ని తీసుకునేందుకు అంగీకరించాల్సిందిగా ఆమెను నితీష్ అడిగారు. 1985 ఎన్నికల్లో పోటీ చేస్తాననీ, అదే తన ఆఖరు ప్రయత్నమని ఆమెకు చెప్పారు. నితీష్ భార్య అప్పుడు ఓ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
ఆ సమయంలో నితీష్ కుమార్ వద్ద పోటీ చేసేందుకు అవసరమైన డబ్బు లేదు. ఆ పరిస్థితుల్లో అతని భార్య మంజు తాను దాచుకున్న డబ్బులో నుంచి రూ.20వేలు ఇచ్చారు. నితీష్ స్నేహితులు కూడా విరాళాలు సేకరించారు. అందరి సహకారంతో నితీష్ 1985 ఎన్నికల్లో పోటీ చేశారు.
నితీష్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదని ఆ పుస్తకం పేర్కొంది. నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ కుమార్ మోడీలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వివరాలను ఈ పుస్తకంలో ఉంది. వీరంతా జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన 1974 ఉద్యమ భాగస్వాములు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications