టిఆర్ఎస్తో బిజెపి దోస్తీ: తేల్చేసిన మురళీధర రావు, కెసిఆర్ తీరుపై వ్యాఖ్య
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితితో తమ పార్టీ చేతులు కలిపే అవకాశాలు లేవని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు స్పష్టం చేశారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో ఉందని, అందువల్ల టిఆర్ఎస్తో కలసి పనిచేసే అవకాశాలు ఉండవని ఆయన చెప్పారు. బిజెపి నాయకత్వం ఆహ్వానిస్తే కేంద్ర మంత్రి వర్గంలో చేరే అంశాన్ని పరిశీలిస్తామంటూ కొంత మంది టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో అర్ధం లేదని మురళీధరరావు అన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, బీహార్ అస్సాం రాష్ట్రాల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా కసరత్తు పూర్తయిందని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు బిజెపి శ్రేణులను సిద్ధం చేయాల్సిందిగా నాయకులను ఆదేశించటం జరిగిందని చెప్పారు.
తెలంగాణలో విజయం సాధించడానికి ముందుగా హైదనరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిజెపి గణనీయమైన విజయం సాధించాల్సి ఉంటుందని మురళీధర్రావు అంగీకరించారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న గేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు ఇదే కొలమానమని చెప్పారు. తమ పార్టీకి హైదరాబాద్లో మంచి బలం ఉందని ఆయన చెప్పారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ మరింత బలోపేతం కావలసిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్ తొలి ఆరు నెలల్లో కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అనుసరించారని, అయితే గత ఆరు నెలల్లో ఆయన వ్యవహార శైలి మారిందని, ఇప్పుడు కేంద్రంలో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని మురళీధర్రావు అన్నారు. ఏడాది పాలనలో కెసిఆర్ విజయం సాధించారా, విఫలమయ్యారా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేశారు. మైనారిటీలను దువ్వి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ అవలంబించిన విధానాలనే కెసిఆర్ అనుసరిస్తున్నారని, ప్రజలు అసహ్యించుకున్న నిజాం నవాబును పొగుడుతూ ముస్లిం ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న కెసిఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తమ పార్టీ భావిస్తున్నప్పటికీ అనివార్య పరిస్థితుల వల్ల సాధ్యపడకపోతే ప్రత్యేక హోదా ద్వారా లభించాల్సిన సదుపాయాలు, రాయితీలు ఏదోవిధంగా అందేలా చూస్తామని మురళీధర్రావు భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మోడీ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని ఆయన చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా మురళీధర్రావు శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
టిడిపి-బిజెపి సంబంధాలు కొనసాగుతాయని, ఆంధ్రప్రదేశ్లో బిజెపిని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో తమ పార్టీ టిడిపి స్థాయికి ఎదిగిన తర్వాతే రాజకీయంగా మార్పులు సాధ్యమవుతాయని మురళీధర్రావు చెప్పారు. ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం అవినీతికి తావులేని పాలన అందించిందని, దీనిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వంలో మోడీ, పార్టీలో అమిత్ షా పెత్తనం చెలాయిస్తున్నారని, వీరు తప్ప మరెవరూ నోరు విప్పే అవకాశాలు లేకుండా పోయాయని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏ విషయంలోనైనా వీరిద్దరు అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాజ్యసభలో బిజెపికి తగినంత బలం లేకపోవడం వల్ల ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం తీసుకువస్తున్న అనేక బిల్లులు చట్టాలుగా మారలేకపోతున్నాయని, కనుక ఈ విషయంలో భావసారూప్యత కలిగిన పార్టీల సహాయాన్ని కోరుతామని మురళీధర్రావు తెలిపారు.