షాక్: భారత్లో వ్యాక్సిన్పై తొలి ఫిర్యాదు -కొవిషీల్డ్తో యాంటీబాడీలు రాలేదు -సీరం, కేంద్రంపై చర్యలుంటాయా?
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతూ, నిన్న కూడా 3, 128 మరణాలు, కొత్తగా 1,52,734 నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం దోబూచులాట, ఫార్మా కంపెనీల భిన్నమైన రేట్లు, రాష్ట్రాల సాగదీత ధోరణి పరిస్థిని మరింత గందరగోళంగా మార్చాయి. ఫార్మా కంపెనీలు నిర్ణయించిన టీకాల ధరలకు కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరుగా ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చోటుచేసుకున్న మరణాలపై ఇప్పటిదాకా దర్యాప్తులు లేవు. వ్యాక్సిన్లు, అల్లోపతిని నిందిస్తూ పతంజలి రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్రం గమ్మునుంది. సరిగ్గా ఈ దశలోనే దేశంలో వ్యాక్సిన్ల సమర్థతపై తొలి ఫిర్యాదు వెల్లువెత్తింది..

యాంటీబాడీలు రాలేదంటూ..
అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్ లో టీకాల కోరత కారణంగా వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్నది. ఆదివారం నాటికి 21,31,54,129 డోసులు పంపిణీ అయ్యాయి. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ తో కొందరు చనిపోతుండటం, ఇంకొందరు మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతుండటం తెలిసిందే. టీకాల సమర్థతపై ఫార్మా కంపెనీల ప్రకటనల నడుమ, వ్యాక్సిన్లపై నెగటివ్ అభిప్రాయాలను తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి మరణాలపై లోతైన దర్యాప్తునకు అవకాశం లేకపోయింది. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా తనలో యాంటీబాడీలు అభివృద్ధి చెందలేదంటూ లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాక్సిన్ సమర్థతపై దేశంలో నమోదైన తొలి ఫిర్యాదు ఇదేనని తెలుస్తోంది..

టీకాతో ఆరోగ్యం గుల్ల..
కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా తనలో యాంటీబాడీలు రాలేదుసరికదా, ఉన్న ప్లేట్ లెట్స్ సగానికి పడిపోయాయని బాధితుడు ప్రదీప్ చంద్ర పేర్కొన్నాడు. ''ఏప్రిల్ 8న నేను కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నా. అదే నెల 28వ తేదీన రెండో డోసు కోసం వెళితే, 6వారాలు ఆగి రమ్మాన్నారు. ఆ తర్వాత 12 వారాలు అయ్యాక వేస్తామని వెనక్కి పంపించారు. తొలి డోసు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్లో నేను యాంటీబాడీ జీటీ టెస్టు చేయించుకున్నా. అయితే, టీకా వల్ల నా శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందలేదని టెస్టుల్లో తేలింది. కొవిషీల్డ్ తొలి డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ హామీకి నా పరిస్థితి పూర్తిగా విరుద్ధం అందుకే అందరిపైనా కేసు పెట్టాలని నిర్ణయించుకున్నా'' అని ప్రదీప్ చంద్ర తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు..

సీరం, కేంద్రంపై చర్యలు కోరుతూ..
కొవిషీల్డ్ వల్ల యాంటీబాడీలు రాలేదన్న ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రదీప్ చంద్ర.. ఆ టీకా తయారీదారు సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలాపై, కేంద్ర ప్రభుత్వ సంస్థ డీసీజీఏ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ్లపై కేసులు పెట్టాలని కోరుతున్నాడు. ఒకవేళ పోలీసులు గనుక చర్యలకు ఉపక్రమించకుంటే తాను కోర్టుకు వెళతానీ బాధితుడు హెచ్చరించాడు. ప్రస్తుతం ఎపిడమిక్ చట్టాలు అమలులో ఉన్నందున వ్యాక్సిన్ సమర్థతపై వచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టాలా, వద్దా అని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు.. ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తలిపారు. కేసు నమోదు అయినా, అలా కాకుండా కోర్టులో పిటిషన్ వేసినా ఈ వ్యవహారం సంచలమే అవుతుంది.












Click it and Unblock the Notifications