రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఓబీసీలు ఎక్కడ?
ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీలు ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలకు తాజా గణాంకాలు ఇచ్చే సమాధానాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. 40 సెంట్రల్ యూనివర్శిటీల్లో బీసీ ప్రొఫెసర్లు లేకపోవడం చర్చానీయాంశంగా మారింది. జనాభా దమాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించాలనే డిమాండ్ ఏళ్లకొద్దీ ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది బీసీ రిజర్వేషన్ల పరిస్థితి.

ఉన్నత ఉద్యోగాల్లో బీసీలెక్కడ?
దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు సరైన న్యాయం జరగడం లేదంటున్నారు ఆ సంఘాల నేతలు. కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్ల కోటా ప్రకారమైనా బీసీలకు ప్రాతినిధ్యం దక్కడం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఓబీసీ కోటా సగం కూడా లేదనే విషయం కూడా స్పష్టమవుతోంది.
సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ యూనివర్శిటీల లోని ఉన్నతస్థాయి (Group - A & B) ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం. కేంద్రంలోని వివిధ విభాగాల నుంచి ఆర్టీఐ కింద సేకరించిన సమాచారంతో ఈ కీలక విషయాలు ప్రచురించింది ఆ పత్రిక.

సెంట్రల్ సర్వీసుల్లో బీసీలు ఎంత?
ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఓబీసీల కోటా పూర్తిగా భర్తీ కావడమే లేదన్నది ఆ కథనం సారాంశం. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వే డిపార్టుమెంటులోనూ ఓబీసీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉందట. 16,381 మంది గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారుల్లో కేవలం 8.05 శాతం మాత్రమే ఓబీసీలు ఉన్నారట. దీని ప్రకారం 1,319 మంది మాత్రమే ఓబీసీ ఉద్యోగులు ఉన్నట్లు లెక్క.
ఓబీసీ రిజర్వేషన్లను సిఫారసు చేసిన మండల్ కమిషన్ 1931 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వారి జనాభా 52 శాతంగా అంచనా వేసింది. రాజ్యాంగం ప్రకారం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. దేశంలోని 40 సెంట్రల్ యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగాల వరకే ఓబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ పోస్టుల్లో 27 శాతం ఉద్యోగాలకు గాను అందులో సగం మాత్రమే ఓబీసీలు ఉన్నారట. 14.38 శాతం మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొంది ఇండియన్ ఎక్స్ప్రెస్.
1,125 మంది ప్రొఫెసర్లకు గాను 3.47 శాతంతో 39 మంది ఎస్సీలు, 0.7 శాతంతో ఎస్టీలు విధులు నిర్వహిస్తుండగా మిగతావారంతా జనరల్ కేటగిరీకి చెందినవారే. 2,620 అసోసియేట్ ప్రొఫెసర్లలో 4.96 శాతంతో 130 మంది ఎస్సీలు, 1.3 శాతంతో 34 మంది ఎస్టీలు కొలువుదీరగా మిగతావారంతా జనరల్ కోటా కింద వచ్చినవారే. ఇక 7,741 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో 12.02 శాతంతో 931 మంది ఎస్సీలు, 5.46 శాతంతో 423 మంది ఎస్టీలు ఉద్యోగాలు చేస్తుండగా, 14.38 శాతంతో 1,113 మంది ఓబీసీలు విధులు నిర్వర్తిస్తున్నారు. అదలావుంటే ప్రొఫెసర్ల కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్లు లేక వారి ప్రాతినిధ్యం కనిపించకుండా పోయింది.

జనాభా అంత.. రిజర్వేషన్లు ఎంత?
బీసీల ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసే నేతలకు ఆ వర్గం రిజర్వేషన్లు మాత్రం పట్టవు అనే ఆరోపణలున్నాయి. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అందులో సగం శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. జనాభా దమాషా మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఎన్ని ఆందోళనలు చేపడుతున్నా.. ప్రభుత్వాలకు చీమకుట్టినట్లైనా లేదంటున్నారు ఆ సంఘం నేతలు. అదే అగ్రవర్ణ పేదలంటూ 10 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టిన ఫైలు ఆగమేఘాలమీద కదిలిందని... గంటల వ్యవధిలో చట్టంగా మారిందని ఆరోపిస్తున్నారు. అటు ఎగువ సభ, ఇటు దిగువ సభ, రాష్ట్రపతి ఆమోదం ఇలా చకచకా జరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లను నాన్చుతూ అగ్రవర్ణ పేదలంటూ 10 శాతం రిజర్వేషన్లు తెరపైకి తేవడం భావ్యం కాదంటున్నారు. ఇది ముమ్మాటికీ బీసీలకు అన్యాయం చేయడమే అవుతుందని కేంద్రంపై మండిపడుతున్నారు.

కోటాకు తూటు..! ఈ 10 శాతం కూడా ఎఫెక్టెనా?
రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాలకు ఇటీవల కేంద్రం పెద్దపీట వేయడం ఆరోపణలకు తావిచ్చింది. ఈ మేరకు బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణ పేదలంటూ 10 శాతం రిజర్వేషన్ కట్టబెట్టారని... వాస్తవానికి వారి జనాభా శాతం ఎంతని ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు ఉద్యోగాల కల్పన, ఎడ్యుకేషన్ పరంగా 10 శాతం రిజర్వేషన్లు తెరపైకి తెచ్చి రాజ్యాంగ సవరణ చేపట్టిన నేపథ్యంలో కేంద్రంపై మండిపడుతున్నారు. రిజర్వేషన్ల కోటాకు తగ్గట్లుగా ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కని నేపథ్యంలో ఈ 10 శాతం రిజర్వేషన్లు మరింత అన్యాయం చేస్తాయని ఆరోపిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications