ప్రతిపక్షాలకు చుక్కెదురు! అలా కుదరదని తేల్చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: బీజేపీ, ఎన్డీయేతర ప్రతిపక్ష పార్టలకు మరో పరాభవం. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై 21 ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ను కేంద్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. గురువారం నాటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం- ముందుగా నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని ప్రకటించింది. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.
గురువారం దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ షెడ్యూల్లో స్పల్పంగా మార్పులు చేయాలని 21 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని కోరిన విషయం తెలిసిందే. ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, అందులో నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను మొదటగా లెక్కించాలని అంటూ ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులను కోరారు.

ప్రతిపక్షాల డిమాండ్ ఇదే..
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఈవీఎంలు, వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను అన్నింటికంటే ముందుగా లెక్కించాలని డిమాండ్ చేశారు. ఒక్క స్లిప్పు తేడా వచ్చినప్పటికీ.. నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంల స్లిప్పులను లెక్కించాల్సిందేనని పట్టుబట్టారు. అయిదు ఈవీఎంలు, వాటి వీవీప్యాట్ స్లిప్పులను చివరగా లెక్కించడం వల్ల ఉపయోగం ఉండబోదని వారు అభిప్రాయపడ్డారు.

నిర్ణయాన్ని నేటికి వాయిదా
దీనిపై తాము ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని తీసుకోలేమని, బుధవారం ఉదయం సమావేశమౌతామని, ఆ తరువాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సునీల్ అరోరా వారికి హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా సునీల్ అరోరా ఈ ఉదయం తన కార్యాలయంలో ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల డిమాండ్ను అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఓట్ల లెక్కింపునకు 24 గంటల సమయం కూడా లేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు షెడ్యూల్లో మార్పులు చేయలేమని వారు సునీల్ అరోరాకు వివరించారు.

గందరగోళాన్ని నివారించడానికే..
అలా చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయిదు ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను మొదటగా లెక్కించడం వల్ల పెద్దగా ఎలాంటి ఫలితాలూ ఉండబోవని అభిప్రాయపడ్డారు. వారందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత సునీల్ అరోరా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టుగా- అయిదు ఈవీఎంలు, వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను మొదటగా లెక్కించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అన్నారు.

సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలే
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో చంద్రబాబుతో కూడిన 21 ప్రతిపక్షాల నాయకులకు ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి రెండుసార్లు ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. 50 శాతం స్లిప్పులను లెక్కించాలంటూ ఆయా పార్టీల నాయకులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అప్పటిదాకా- ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్గా ఎంపిక చేసిన ఒక పోలింగ్ బూత్ నుంచి ఒక్క ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కించే విధానం అమలులో ఉండేది. ప్రతిపక్షాల పిటీషన్ను విచారణకు స్వీకరించిన తరువాత సుప్రీంకోర్టు ఈ సంఖ్యను ఒకటి నుంచి అయిదుకు పెంచింది. అది కూడా సరిపోదని 50 శాతం స్లిప్పులను లెక్కించాల్సిందేనంటూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయగా.. ధర్మాసనం దాన్ని కొట్టి పడేసింది.












Click it and Unblock the Notifications