ఆధార్ లేదన్న సాకు చూపి స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వకుంటే చర్యలు: యూఐడీఏఐ
ఢిల్లీ: దేశంలో ఆధార్ నంబర్ తీసుకొచ్చిన విప్లవం అంతా ఇంతాకాదు. ఒక సంచలనమే అది సృష్టించింది. ఏ ప్రభుత్వ ఫలాలు అందాలన్నా ఆధార్ నంబరే ఆదారం అవుతోంది. ఆధార్ లేకుంటే కొన్ని పథకాలు కూడా వర్తించవు. ఇది జీవితంలో ఒక భాగమైపోయింది. ఆధార్ నెంబర్ లేక చాలామంది ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అందుకోలేకపోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఎన్నో కేసులు కూడా కోర్టులో దాఖలయ్యాయి. అంతలా దేశంలో ఒక నవ విప్లవం తీసుకొచ్చింది ఆధార్.
తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఒక ఊరటనిచ్చే ప్రకటనచేసింది. స్కూళ్లలో పిల్లలు అడ్మిషన్ పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉంటూ వచ్చేది. ఇప్పుడు పిల్లలు స్కూళ్లో అడ్మిషన్ పొందాలంటే ఆధార్ తప్పని సరికాదంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది. అంతేకాదు ఆధార్ నమోదు, అప్డేషన్ లాంటివి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలంటూ స్కూళ్లు, స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, రాష్ట్ర విద్యాశాఖలకు, జిల్లా పాలనాయంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించింది.
స్కూళ్లలో ఆధార్ లేనందున పిల్లలకు అడ్మిషన్ ఇవ్వడంలేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందని యూఐడీఏఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆదార్ లేనందున పిల్లలకు స్కూల్ అడ్మిషన్ ఇవ్వడం తిరస్కరిస్తే చర్యలు తప్పవని పేర్కొంది. యూఐడీఏఐ తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులు పిల్లలు ఆధార్ లేనందున పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత ఊరట లభించినట్లు అయ్యింది. ఆధార్ నెంబర్ కేటాయించే వరకు స్కూలు అడ్మిషన్ కోసం ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని యూఐడీఏఐ పేర్కొంది.