ఇదెక్కడి అవిశ్వాసం: లైట్గా తీసుకున్న మోదీ: సోషల్ మీడియా కామెంట్స్ ప్రస్తావన..!!
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని మోదీ జోస్యం చెప్పారు.
ఈ సాయంత్రం సరిగ్గా 5:10 నిమిషాలకు మోదీ తన ప్రసంగాన్ని ఆరంభించారు. నిర్దేశిత సమయం కంటే గంటా 10 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఆలస్యంగా ఆరంభమైంది. నిజానికి- ఈ సాయంత్రం 4 గంటలకు మోదీ సభను ఉద్దేశించి అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించాల్సి ఉంది. దీనికి బదులుగా 5:10 నిమిషాలకు మోదీ ప్రసంగం మొదలైంది.

2014, 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, గత రికార్డులన్నింటినీ చెరిపివేస్తామంటూ ధీమాగా చెప్పారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోదీ తప్పుపట్టారు. అసలు ఎలాంటి చర్చ పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు తమ టీమ్ను సరిగ్గానే ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ- ఫోర్లు, బౌండరీలను కొట్టడం మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు మోదీ. దేశ ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని, 2014లోనే కాకుండా.. ఆ తరువాతి ఎన్నికల్లోనూ సంపూర్ణ మెజారిటీతో తమను గెలిపించారని మోదీ గుర్తు చేసుకున్నారు.

తమ దృష్టి మొత్తం దేశాభివృద్ధిపైనే ఉందని, ప్రతి గంట కూడా దానికే కేటాయిస్తామని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం, ఉద్యోగాల సృష్టి, ప్రపంచ దేశాలకు ధీటుగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. వంటి అంశాలకే తాము ప్రాధాన్యత ఇస్తోన్నామని పేర్కొన్నారు. అవినీతి రహిత పరిపాలనను అందించడమే లక్ష్యమని అన్నారు.
కొన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇవేవీ పట్టట్లేదని, పని చేసే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నాయని మోదీ విమర్శించారు. అందులో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు. పేదల ఆకలికి బదులుగా ఎంతసేపు తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికే ప్రయత్నిస్తోన్నాయని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications