కరోనా లాక్డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా సడలింపు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి.

లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నాయి.. కానీ..
కాగా, లాక్డౌన్ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని తెలిపారు.

కరోనా ఆస్పత్రులు రెండుగా..
ప్రధాని నరేంద్ర మోడీ పేదలను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, దానిపైనే ప్రత్యేక దృష్టి సారించారని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మందికిపైగా కరోనా పరీక్షలు చేయించామని చెప్పారు. అలాగే, కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించామని, కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తామని వివరించారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తామని, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తామని తెలిపారు.

కరోనా సేవలు మూడు విభాగాలుగా..
ఇక కరోనావైరస్ వైద్య సేవలను మూడు భాగాలుగా విభజించామని లవ్ అగర్వాల్ చెప్పారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు ఢిల్లీ, ముంబై, బిల్వాడా, ఆగ్రా ప్రాంతాల్లో కరోనా కట్టడికి జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించామని తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని, కొరత రాకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించామని తెలిపారు.
Recommended Video

దేశంలో పెరుగుతున్న కేసులు
కరోనా వైరస్ వ్యాపించినవారికి అందించే వైద్య సేవలను కరోనా కేర్ సెంటర్లు, కరోనా హెల్త్ సెంటర్లు, కరోనా ఆస్పత్రులు అనే మూడు భాగాలుగా విభజించామని తెలిపారు. కరోనా కేర్ సెంటర్లలో అనుమానితులకు, కరోనా హెల్త సెంటర్లలో వైరస్ ప్రారంభదశలో ఉన్నవారి కోసం, కరోనా ఆస్పత్రుల్లో వైరస్తో ఆరోగ్యం క్షీణించిన వ్యక్తులను చికిత్సను అందజేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు లవ్ అగర్వాల్ వివరించారు. కాగా, దేశ వ్యాప్తంగా దాదాపు 4500 మందికి కరోనా సోకగా, గడిచిన 24గంటల్లో 350 మందికి కేసులు నమోదు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications