మళ్లీ ఇంటివేటలో పడ్డ కేజ్రీవాల్: ఇలా ఉండాలి, పాత దానిపై మక్కువ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు రోజులు కావొస్తుంది. అయన మాత్రం ఇంకా తన కౌసింబీలోని ఇంటిలోనే నివసిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినందున పలువురు అధికారులు, ఇతర సమావేశాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో అందుకు అనుకూలంగా ఉండే భవంతిని ప్రభుత్వ అధికారులు వెతుకుతున్నారు. తనకు ఎలాంటి ఇల్లు కావాలో కేజ్రీవాల్ అధికారులకు సూచించారని సమాచారం. తనకు మూడు నాలుగు గదులు ఉన్న ఇల్లు కావాలని, బయట మాత్రం ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండాలని సూచించారు.
ఆరు బయటనే సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉన్న ఇంటిని చూడాలని కోరారని సమాచారం. పెద్ద లాన్ ఉండి, మూడు లేదా నాలుగు బిహెచ్కే గది చాలని చెప్పారు.
2013లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు తిలక్ లేన్లోని బంగ్లాను ఇచ్చారు. అయితే, గత జూలై నెలలో ఆయన రాజీనామా చేసి, ఖాళీ చేశాక దానిని మరొకరికి అలాట్ చేశారు.
ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ఐదు నెలలకు తిలక్ లేన్లోని ఇంటిని ఖాళీ చేశారు. తన కూతురు పరీక్షల నిమిత్తం ఆయన అదే బంగాల్లో నివసించారు. ఇంటిని ఖాళీ చేయనందుకు విపక్షాల నుండి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే, ఆ తర్వాత అతను అదే బంగాల్లో మరికొంత కాలం ఉండేందుకు ప్రభుత్వం నుండి అనుమతి వచ్చింది. ఈ ఇల్లు అరవింద్ కేజ్రీవాల్కు ఇష్టమైనదని అంటున్నారు.
కాగా, ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ దగ్గరలో గల కౌసుంబీలోని గిరి నగర్ టవర్ వద్ద గల ఓ ఆపార్టుమెంటులోని 403 నెంబర్ ఇంటిలో నివసిస్తున్నారు. అతను తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి అందులో ఉంటున్నారు.
కేజ్రీవాల్ను ఘెరావ్ చేసిన రిక్షావాలాలు
కౌసంబిలో కేజ్రీవాల్ ఎదుట ఎలక్ట్రానిక్ రిక్షావాలాలు ఆందోళన నిర్వహించారు. ఢిల్లీ అంతటా ఈ రిక్షాలు తిప్పేందుకు అనుమతించాలని కోరారు. తమపైనున్న ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. సమస్యను పరిష్కరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.