నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..
Recommended Video
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. దోషులు తరపు న్యాయవాది కూడా ఈ మేరకు వెల్లడించారు.
ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు లేనట్లే..
ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించడం లేదని న్యాయస్థానం చెప్పిందని తెలిపారు. కాగా, దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. పాటియాల హౌస్ కోర్టు న్యాయమూర్తి తీర్పు నేపథ్యంలో నలుగురు దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు శనివారం ఉరిశిక్ష అమలు లేనట్లేనని తేలిపోయింది.
నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం..
పాటియాలా హౌస్ కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన కూతురుకు న్యాయం చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాయని ప్రశ్నించారు. దోషులకు మరణశిక్ష పడకుండా చూసుకుంటానని వారి తరపు న్యాయవాది తనతో సవాల్ చేశాడని..నిర్భయ తల్లి ఆశా చెప్పారు.
రాజ్యాంగం ఎందుకు తగలబెట్టడానికా?
తన కూతురికి దేశంలో బతికే హక్కు లేదు కానీ.. తన కూతురును చంపిన వాళ్లకు మానవ హక్కులున్నాయంటూ వాదిస్తున్నారని నిర్భయ తల్లి మండిపడ్డారు. తన కూతురుకు అన్యాయం జరిగితే రాజ్యాంగం ఎందుకు? తగలబెట్టండని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కోర్టు తీర్పు పట్ల తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని నిర్భయ తరపు న్యాయవాది తెలిపారు. నిర్భయకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె తల్లి ఆశా, ఆమె తరపు న్యాయవాది చెప్పారు.
ఉరిశిక్ష వాయిదా పడేందుకు పిటిషన్లు..
ఇటీవల ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు శనివారం ఉదయం(ఫిబ్రవరి 1) 6గంటలకు ఉరితీయాల్సి ఉంది. అయితే, తాజాగా పాటియాల హౌస్ కోర్టు తీర్పుతో వారి ఉరిశిక్ష వాయిదా పడింది. ఇప్పటికే నిర్భయ దోషులు క్షమాభిక్ష పెట్టాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో కోర్టుల్లో వారి పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో వారి శిక్షలు వాయిదా పడేలా పిటిషన్లు వేస్తుండటం గమనార్హం.
2012లో నిర్భయపై ఘోరం..
2012లో మొత్తం ఆరుగురు నిందితులు నిర్భయపై దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఆరు నిందితుల్లో ఒకరు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంలో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మిగితా నలుగురు నిందితులను దోషులుగా తేల్చి, ఉరిశిక్షను విధించింది కోర్టు. అయితే, వారికి విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా దోషులు పిటిషన్లు వేస్తున్నారు.