సండే నో హాలిడే, విధుల్లోకి జయలలిత: ఆదివారం సెక్రటేరియట్కు
చెన్నై: మెరీనా బీచ్లో మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో శనివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత ఆదివారం సెక్రేటరియట్కు వచ్చి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఆదివారం సెలవు తీసుకోరాదని భావిస్తున్న 'అమ్మ' రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని 'అమ్మ క్యాంటీన్'లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె సచివాలయాని వస్తారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో, ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు సెక్రటేరియట్ ఉద్యోగులు, పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జయలలిత శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన సీఎం పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో కర్ణాటక హైకోర్టు ఈనెల 11న ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. దాంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పోన్ రాధాకృష్ణన్, బీజేపీ సీనియర్ నేతలు ఇలగణేశన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ నటులు శరత్కుమార్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.