కిల్లర్ కరోనా: 80కి చేరిన మృతుల సంఖ్య, చైనాలో భారతీయులు సేఫ్, విదేశాంగ శాఖ స్పష్టీకరణ
కరోనా వైరస్తో చైనాలో ఇప్పటివరకు 80 మంది చనిపోయారు. వైరస్ సోకిన వేలాదిమంది ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో చైనాలో ఉంటోన్న భారతీయుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. వైరస్ బారిన ఒక్క భారతీయుడు కూడా పడలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. అయితే రాజధాని బీజింగ్లో వివిధ వర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉంటారు. వుహన్, హుబేలో కూడా భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతాల్లో భారతీయులు ఎవరికీ వైరస్ సోకలేదని ఎంఈఏ స్పష్టంచేసింది.

2008 మందికి సోకిన వైరస్..
వైరస్తో చైనాలో 80 మంది చనిపోగా.. వైరస్ సోకిన వారి సంఖ్య 2008 మందికి చేరింది. ఇందులో 23 మంది విదేశాలకు చెందినవారు ఉన్నారు. తొలుత వైరస్ వుహన్ సిటీ, సెంట్రల్ చైనాలోని హుబె ప్రాంతంలో గతనెలలో గుర్తించారు. ఇక అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్కడున్న 11 మిలియన్ల ప్రజలను ఇతర ప్రాంతాలకు వచ్చేందుకు అనుమతించడం లేదు. వైరస్ సోకే అవకాశం ఉన్నందున వారిని ఇళ్లకే పరిమితం చేశారు. వుహనే కాదు మరో 12 నగరాల ప్రజలను కూడా నిర్బంధంలో ఉంచారు.

నిశీత పరిశీలన..
చైనాలో వైరస్ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాకు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. చైనా అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా ఇప్పటివరకు ఒక్క భారతీయుడు కూడా వైరస్ వ్యాధి బారినపడలేదని తెలిపారు.

మూడు హెల్ప్లైన్లు
అంతేకాదు చైనాలో ఇండియన్ ఎంబసీలో భారతీయుల సాయం కోసం మూడు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అక్కడ భారతీయులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సమాచారం అందజేయాలని కోరారు. ఒకవేళ కొందరు హుబే నుంచి రావాలనుకుంటే కూడా హెల్ప్ లైన్ నంబర్ ఫోన్ చేయాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియన్ ఎంబసీ, కాన్యులేట్ జనరల్.. చైనా అధికారులతో సమన్వయం చేసుకొని భారతీయులకు సాయం చేసేపనిలో నిమగ్నమయ్యారని చెప్పారు.

సెలవుల పొడిగింపు
చైనాలో కరోనా వైరస్ నేపథ్యంలో న్యూ ఇయర్ సెలవులను ప్రభుత్వం పొడిగించింది. స్వస్థలాల నుంచి పనిచేసే చోటుకు రావాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి 30 తర్వాత వరకు పొడిగిస్తున్నట్టు చైనా అధికారవర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications