కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు: తప్పనిసరి కాదు..బలవంత పెట్టొద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ.. ఈ మహమ్మారి విస్తృతికి అడ్డుకట్ట పడట్లేదు. కొత్త వేరియంట్లతో దడ పుట్టిస్తోందీ మహమ్మారి. జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుదల బాట పట్టింది. దేశ రాజధానిలో కోవిడ్ బాధితులు, జ్వర పీడితుల సంఖ్య పెరగడం కలవరపాటుకు గురి చేస్తోంది.

పెరుగుతున్న కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,723 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. ఒక్కరోజు వ్యవధిలోనే 408 పాజిటివ్ కేసులు అధికంగా రికార్డయ్యాయి. 26 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,82,345కు చేరింది. ఇందులో 4,25,38,976 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,23,869 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసులు 20 వేలకు చేరువ అయ్యాయి. 19,500లకు చేరాయి.

వ్యాక్సినేషన్పై సుప్రీంకోర్టు..
మరోవంక కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆరు సంవత్సరాల పిల్లలకు సైతం వ్యాక్సిన్ వేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలిపింది. ఈ పరిణామాల మధ్య దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రానికి ఆదేశాలను జారీ చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎవ్వర్నీ బలవంత పెట్టొద్దని సూచించింది. వ్యాక్సిన్ వేసుకోవాలని బలవంతం చేయడం రాజ్యంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

తప్పనిసరి కాదు..
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించడం కూడా సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, భూషణ్ రామకృష్ణ గవాయ్ స్పష్టం చేశారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ మాజీ సభ్యుడు జాకబ్ పులియెల్ దాఖలు చేసిన పిటీషన్ను ఈ బెంచ్ విచారణకు స్వీకరించింది. ప్రజా రవాణా వ్యవస్థ, ఆహార ధాన్యాలను స్వీకరించడంలో పలు రాష్ట్రాలు కోవిడ్ వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేసినట్లు పిటీషనర్ పేర్కొన్నారు.

ఆంక్షలు విధించడం సరికాదు..
దీనిపై విచారణ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ వేసుకోవాలని బలవంతం చేయడం అతని హక్కులను హరించినట్టేనని న్యాయమూర్తులు చెప్పారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని నిషేధించడం సరికాదని, అలాంటి ఆంక్షలు ఏవైనా విధించి ఉంటే వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. అలాంటి చర్యలను ప్రోత్సహించలేమని వ్యాఖ్యానించారు.

దుష్ప్రభావాల గురించి బయటపెట్టండి..
కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఏర్పడివుంటే దానికి సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేయాలని న్యాయమూర్తులు- కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించారు. దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని అన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్కు సంబంధించిన డేటాను కూడా విడుదల చేయాలని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయొద్దని కేంద్రానికి సూచించారు. పిల్లలకు ఇస్తోన్న వ్యాక్సినేషన్.. ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications