ఈడీపై మాల్యా ఆగ్రహం, ట్విస్ట్.. ముందే అమ్మేశారా?
ముంబై/లండన్: తన ఆస్తులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం పైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈడీ ఆటాచ్లో అర్థం లేదని మండిపడ్డాడు. తాను నిధులను మళ్లించలేదని పేర్కొన్నాడు.
బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాల వరకు ఎగవేసిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూబీ గ్రూప్కు చెందిన రూ.1,411 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీనిపై విజయ్ మాల్యా స్పందించాడు.
మాల్యాకు షాక్: రూ.1,400 కోట్లు జప్తు చేసిన ఈడీ
విచారణ జరగకుండానే తనను దోషిగా చూపేందుకు ఈడీ యత్నిస్తోందన్నాడు. ఐడీబీఐ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన నిధులను మాల్యా అక్రమ పద్ధతుల్లో విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ... ఆస్తులను అటాచ్ చేయడం పైనా స్పందించాడు.
ఈడీ తనపై పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందన్నాడు. కోర్టులో కేసు విచారణ జరగకముందే తనను దోషిగా చూపేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నాడు. అయినా ఆస్తులను అటాచ్ చేస్తే బ్యాంకులకు, ఉద్యోగులకు బకాయిలు ఎలా చెల్లించాలని ప్రశ్నించాడు.
పూర్తిగా సివిల్ వివాదాలుగా ఉన్న కేసుల్లో క్రిమినల్ అభియోగాలు ఎలా నమోదు చేస్తారన్నాడు. తన పాస్ పోర్టు రద్దుతో పాటు 'ప్రొక్లెయి డ్ అబ్ స్కాండర్'గా తనను ప్రకటించేందుకు జరుగుతున్న యత్నాలను కూడా మాల్యా ప్రస్తావించాడు.
ఈడీ దర్యాప్తునకు తాను హాజరుకాబోనని ఎప్పుడూ చెప్పలేదని, హాజరయ్యేందుకు సమయం కావాలని కోరానని చెప్పాడు. ముందుగా ఖరారైన విదేశీ పర్యటనకు తాను మార్చి 2న జెనీవాకు వచ్చానని, ఆ సమయంలోనే తనపై కేసులు నమోదయ్యాయన్నాడు. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన క్రమంలో ఇప్పుడప్పుడే దేశానికి తిరిగిరాలేనని కోర్టులకు తెలిపానని ఆయన చెప్పాడు.
మాల్యా ఆస్తులు అమ్మేశారా?
మాల్యాకు చెందిన రూ.1411 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వాధీనం చేసుకోవడానికి ముందే మాల్యా తన ఆస్తులను అమ్మేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. కూర్గ్, దానికి సమీపంలో ఉన్న రెండు ఆస్తులను మాల్యా అధిక ధరకు అమ్మేశారని తెలుస్తోంది.