తమిళనాడులో ఆగస్టు 9 వరకు కరోనా లాక్డౌన్ పొడిగింపు: బయటతిరగొద్దంటూ సీఎం సూచన
చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, కేరళలో భారీగా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడులో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ను మరో వారం పొడిగించారు.
ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. కొత్తగా ఎలాంటి సడలింపులు కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ పొంచివున్నందున అనవసరంగా బయట తిరగవద్దని ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అదికారులు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, తమిళనాడులో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చెన్నై, కోయంబత్తూరులో వరుసగా మూడరోజూ కరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో గతంలో విధించిన లాక్డౌన్ జులై 16తో ముగియగా ఆ తర్వాత దాన్ని జులై 30 వరకు పొడిగించారు. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తాజాగా ఆ గడువును ఆగస్టు 9 వరకు పొడిగించారు.
కాగా, గత 24 గంటల వ్యవధిలో తమిళనాడులో 1859 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 28 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 21,207 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.23 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 40 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.
ఇది ఇలావుండగా, కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా 20వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 20,772 కరోనా కేసులు వెలుగు చూడగా, 116 మంది మరణించారు. కేరళలో కరోనా పాజిటివిటీ రేటు 13.61 శాతంగా ఉండటం గమనార్మం. ప్రస్తుతం కేరళలో 1,60,824 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications