ఆ రెండు వ్యాక్సిన్లలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు, 28 రోజుల్లోనే రెండు డోసులు
న్యూఢిల్లీ: వచ్చే శనివారం నుంచి ఇచ్చే కరోనా వ్యాక్సిన్లో ఎంపిక చేసుకునే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే తొలి దశ వ్యాక్సినేషన్లో హెల్త్కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
16 నుంచి ఆ రెండు వ్యాక్సిన్లు..
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు భారత డ్రగ్ కంట్రోల్ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్ల డోసులను 24 రోజుల కాల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యాక్సిన్ డోసు ఇచ్చిన తర్వాత మరో డోసు 14వ రోజున ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకునేవారికి ఒక రోజు ముందుగానే సందేశం వస్తుంది. కో-విన్ యాప్లో ఇప్పటికే కోటి మంది వరకు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
రాష్ట్రాలకు చేరుకున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు ఎవరైతే కరోనా బారినపడి ఆరోగ్య విషమంగా ఉందో వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి దశలో సుమారు 30 కోట్ల మందికి ఈ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇదంతా ఆరు నుంచి ఎనిమిది నెలలో జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్లు చేరుకోవడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కరోనా వ్యాక్సిన్లు చేరుకున్నాయి.
విమానాల ద్వారా 56.5 లక్షల డోసులు
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు భారీ ఎత్తున రాష్ట్రాలకు చేరుకున్నాయి. విమానాల ద్వారా 56.5 లక్షల డోసులను దేశంలోని పలు నగరాలకు విమానాల ద్వారా పంపినట్లు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు కంపెనీల నుంచి డోసులను కొనుగోలు చేసింది.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం
సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి 1.1 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసులను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిస్తోంది. తొలి 100 మిలియన్ల డోసులను ప్రభుత్వానికి రూ. 200 చొప్పున అందిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అయితే, టాక్సులు కూడా కలుపుకుంటే రూ. 220 అవుతుందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రూ. 1000 విక్రయిస్తామని తెలిపారు. ఇక కోవాగ్జిన్ ధర రూ. 309.5గా ఉంది. 16.5 లక్షల వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ ఉచితంగానే అందజేయనుంది. వ్యాక్సిన్ పోటీ నేపథ్యంలో ఒక డోసు ధర రూ. 206 ఉండనుందని అంచనా వేస్తున్నారు.