రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకాదు.. కానీ: కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్పై..
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ఇక నుండి ప్రత్యేక హోదా ఉండదని, ఇందుకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ఆమోదించామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మంగళవారం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జయంత్ సిన్హా స్పందించారు. ఇప్పటి వరకూ ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం వేర్వేరుగా నిధులు ఇస్తోందని, కానీ 14వ ఆర్థిక సంఘం మాత్రం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసిందన్నారు.
ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందా? భవిష్యత్తులో ప్రత్యేక హోదా రాష్ట్రాలు, హోదా లేని రాష్ట్రాలు అన్న వ్యత్యాసాన్ని పూర్తిగా రద్దు చేసేస్తారా? అని జైరామ్ ప్రశ్నించారు. ఇందుకు జయంత్ సిన్హా సమాధానం ఇస్తూ.. ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ఎన్నో ఏళ్లుగా వస్తోందని, దీనిని 14వ ఆర్థికసంఘం చాలా తీవ్రంగానూ, జాగ్రత్తగానూ చేపట్టిందన్నారు.
హోదా అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పనిలేదని, ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఆమేరకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించిందన్నారు. ఆర్థిక లోటుగల రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలని సూచించిందన్నారు. ఆ మేరకు కేటాయింపులు చేశామన్నారు.
ఏఏ రాష్ట్రాలకు ఏ మేరకు కేటాయింపులు జరిగాయో కూడా ఇంతకుముందే స్పష్టంగా వివరించామన్నారు. దీనికి అదనంగా చట్టాల ద్వారా ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఉన్నాయన్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని గుర్తు చేశారు. చట్టంలో ఉన్న, పార్లమెంటు ద్వారా ఇచ్చిన అన్ని హామీలను పూర్తిగా గౌరవిస్తామన్నారు.
ఎల్పీజీ గ్యాస్ అంశంపై..
గ్యాస్ సబ్సిడినీ ఇప్పటి వరకు ఎవరికీ తీసి వేయాలని నిర్ణయించలేదని జయంత్ సిన్హా వేరుగా చెప్పారు. 1.46 లక్షల మంది వినియోగదారులు ఇప్పటి వరకు తమకు సబ్సిడీ అవసరం లేదని చెప్పారని తెలిపారు.