రజినీకాంత్కి 'పద్మ' వెనుక రాజకీయంలేదు: జవదేకర్
చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్కు పద్మ విభూషణ్ ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని కేంద్రమంత్రి, బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ గురువారం నాడు స్పష్టం చేశారు. రజినీకాంత్కు పద్మ విభూషణ్ రావడంపై తమిళనాట 'రాజకీయ' చర్చ జరిగింది.
బిజెపి ఆ అవార్డు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ, రజినీకాంత్ల మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా కమలనాథులు రజినీకాంత్ను, ఆయన అభిమానులను తమ వైపు తిప్పుకునేందుకు అవార్డు ప్రకటించి ఉంటారని కొందరు భావిస్తున్నారు.
దీనిపై జవదేకర్ గురువారం కోయంబత్తూరులో స్పందించారు. ఎలాంటి రాజకీయాలు లేవని, రజినీకాంత్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ అవార్డు రజినీకాంత్ను తమ వైపుకు తిప్పుకునేందుకనే మీడియా కథనాలను జవదేకర్ ఖండించారు. అవార్డు వెనుక ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. ఆయనకు అవార్డు ఇవ్వడం ద్వారా ఆ అవార్డుకు మరింత గౌరవాన్ని కలిగించామన్నారు.
రజినీకాంత్ గొప్ప నటుడు మాత్రమే కాకుండా చాలా మంచి మనిషి అన్నారు. ఏ తరం వాళ్లకైనా సరే ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయన స్టయిల్ రాబోయేతరం వారికి కూడా నచ్చుతుందని చెప్పారు. అందుకే ఆ అవార్డు ఆయన సొంతమైందన్నారు.
అదే సమయంలో ఇటీవల వందకు పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి మరణించిన అంశంపై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. పరిశోధనలు సాగుతున్నాయని, ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.