బందరు టెక్కీ అనూహ్య హత్య కేసులో పురోగతి సున్నా
ముంబై: ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు ఏ విధమైన ప్రగతీ సాధించలేదు. నిందితుడి చిత్రాలు విడుదుల చేసినప్పటికీ, పలువురిని అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ పోలీసులు కేసును ఛేదించలేకపోయారు.
అనూహ్య హత్య కేసులో పోలీసులు దాదాపు 400 మందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమె స్నేహితులను, సహోద్యోగునలను కూడా ప్రశ్నించామని, అయినా ఫలితం కనిపించలేదని పోలీసులు అంటున్నారు. తమకు ఏ విధమైన కీలక సమాచారం లభించలేదని వారంటున్నారు.
ఆమెపై అత్యాచారం జరిగినట్లు డిఎన్ఎ నివేదికలో గానీ పోస్టుమార్టం నివేదికలో గానీ బయటపడలేదని, ఇది అనుకోకుండా జరిగిన హత్యగా భావిస్తున్నామని ముంబై పోలీసులు అంటున్నారు. హత్య జరిగి నెల రోజులు దాటుతోంది. అయినా అనూహ్య బ్యాగ్, ల్యాప్టాప్ వంటి కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు.
ముంబైలోని తిలక్ టెర్మినస్లో రైలు దిగిన తర్వాత అనూహ్యతోపాటు వెంట నడిచిన అనుమానాస్పద వ్యక్తి రేఖా చిత్రాలను పోలీసులు గురువారం విడుదల చేశారు. అనూహ్యతోపాటు ఫ్లాట్ ఫాంపై కనిపిస్తున్న అనుమానాస్పద వ్యక్తి, అనూహ్యను కలవడానికి ముందు సుమారు అరంగటపాటు ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అంతేగాక ఆ అనుమానాస్పద వ్యక్తి చేతిలో ఉన్నది మద్యం బాటిల్గానే పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో అతను మత్తులోనే ఉన్నట్లు సిసి కెమెరా ఫుటేజి పరిశీలనలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కాగా గురువారం విడుదల చేసిన అనుమానిత నిందితుల రేఖా చిత్రాలను మద్యం దుకాణాలు, బార్ షాపులలో చూపిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు చెప్పారు.