ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ విషయంలో కొత్త టెన్షన్!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పని చేసే కూలీలకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఉపాధి హామీ కింద పని చేస్తున్న కూలీలందరికీ ఈ-కేవైసీ (e-KYC) నమోదు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మే 11వ తేదీతో ముగియనుంది. అయితే తెలంగాణలో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవటంతో ఉపాధి హామీ కూలీలలో కొత్త ఆందోళన నెలకొంది .
ఉపాధి హామీ ప్రతి కూలీకి ఈ-కేవైసీని తప్పనిసరి
ఇంకా 3.38 లక్షల మంది కూలీలు నమోదు ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నెలలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టడం, పనుల నమోదు, వేతనాల చెల్లింపులను పారదర్శకం చేయడం కోసం ప్రతి కూలీకి ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.

ఇంకా పూర్తి కాని ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ నమోదు
దీని ద్వారా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నిర్ధారణ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 49,76,151 మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా, ఇప్పటి వరకు 46,37,356 మంది మాత్రమే ఈ-కేవైసీ నమోదు పూర్తి చేశారు. ఇంకా సుమారు 6.78 శాతం మంది 3.38 లక్షలు మిగిలి ఉన్నారు.జిల్లాల వారీగా పరిశీలిస్తే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 96.71% నమోదు పూర్తయింది.
ఈకేవైసీ నమోదు కాకపోవటానికి కారణాలు ఇవే
అయితే కామారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 90.94% మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఏ ఒక్క జిల్లాలో కూడా 100% నమోదు పూర్తి కాలేదు.నమోదు ఆలస్యానికి కూలీలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం,ఆధార్లో పేరు, ఫొటో, వివరాలు సరిపోకపోవడం,ఐరిస్ (కంటి) వివరాల్లో మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు, అవగాహనా లోపం ప్రధాన కారణాలు.
నేడు, రేపు నమోదుకు డెడ్ లైన్
పంచాయతీరాజ్ శాఖ అధికారులు రెండు రోజుల్లో మిగిలిన నమోదులను పూర్తి చేయాలని అన్ని జిల్లా అధికారులకు సూచించారు. గడువు ముగిసిన తర్వాత నమోదు లేని కూలీలకు పనులు కేటాయించడం, వేతనాలు చెల్లించడం వంటి ప్రక్రియలు ప్రభావితం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో
ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి గ్రామ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, ఇంటింటికి వెళ్లి నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు, గ్రామీణులు ఉపాధి పొందుతున్నందున ఈ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం అత్యంత కీలకం కాగా నమోదు పూర్తి కాని క్రమంలో తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications