కేంద్రమంత్రి సంచలన కామెంట్స్ : 'స్కర్టులు ధరించవద్దు'
న్యూఢిల్లీ : మహిళలపై దాడులకు వారి వస్త్రధారణే కారణమని గతంలో చాలామంది నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విదేశీ పర్యాటకులు స్కర్టులు ధరించవద్దని కేంద్రమంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమవుతున్నాయి.
విదేశీ మహిళల భద్రత అంశంపై మాట్లాడిన కేంద్రమంత్రి మహేశ్ శర్మ.. భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు దయచేసి స్కర్టులు ధరించవద్దని సూచించారు. దేశ పర్యటనకు వచ్చే విదేశీయులు ఇక్కడ ఎలా నడుచుకోవాలి.. ఎలా నడుచుకోకూడదు లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు.. ఓ కార్డుపై ఆయా అంశాలన్నింటిని పొందుపరిచి భారత విమానాశ్రయాల్లో అడుగుపెట్టేవారికి అందజేస్తున్నామని తెలిపారు.
సాంప్రదాయిక దేశమైన భారత్ లో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలులో ఉందని.. తాజ్ మహల్ లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేప్పుడు విదేశీ మహిళలు స్కర్టులు ధరించివద్దని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. వివరణ ఇచ్చుకున్నారు మహేశ్ శర్మ.
ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి మహేశ్ శర్మ స్కర్టు కామెంట్స్ పై ఢిల్లీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా ఫైర్ అయ్యారు. ఇలాంటి సలహాలతో దేశాన్ని కించపరిచే పని చేయవద్దని సూచించారాయన. అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం కేంద్రమంత్రికి అండగా నిలబడ్డారు. దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల్లో విదేశీయులు స్కర్టులు ధరించరాదని కేంద్రమంత్రి చేసిన సూచనతో తాము ఏకీభవిస్తున్నట్లు పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు.
భారతీయ మహిళలు ఇస్లామిక్ దేశాలకు వెళ్లినపుడు బుర్ఖా, స్కార్ఫ్ లాంటి అక్కడి సాంప్రదాయ దుస్తులను ధరించాల్సిందిగా సలహా ఇవ్వాలని ఓ నెటిజెన్ కేంద్రమంత్రిని కోరడం గమనార్హం.