ఇండియన్ సర్జికల్ స్ట్రైక్ : తీవ్రంగా ఖండించిన షరీఫ్
ఇస్లామాబాద్ : యూరీ ఉగ్ర ఘటన తర్వాత పాక్ పై భారత్ చేపట్టిన తొలి భారీ సర్జికల్ స్ట్రైక్ (ఆర్మీ దాడి) ప్రచారాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. ఓవైపు ఇండియాతో కొర్రీలు పెట్టుకుంటూనే.. పొరుగు దేశంతో శాంతియుతంగా మెలగాలన్న ఆలోచనను తమ బలహీనతగా భావించవద్దని షరీఫ్ హెచ్చరించడం గమనార్హం.
పాకిస్తాన్ సమగ్రతను కాపాడేందుకు అక్కడి భద్రతా బలగాలు పూర్తి సంసిద్దతో ఉన్నాయని షరీఫ్ తెలిపారు. ఎల్ఓసీ బోర్డర్ పై భారత ఆర్మీ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు షరీఫ్. భారత సైనికుల కాల్పుల ఉల్లంఘన వల్ల పాకిస్తాన్ సైనికులు ఇద్దరు మరణించినట్టుగా పాక్ మీడియా వెల్లడించింది.
"అసలు ఇండియా సర్జికల్ దాడికి పాల్పడలేదు.. భారత సైనికులు బోర్డర్ క్రాస్ చేసి కాల్పులకు పాల్పడి ఉండాలి. అదే గనుకు జరిగితే పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది. భారత సైనికులు పాక్ సైనికులపై చేసిన దాడిని యూరీ ఉగ్రవాద ఘటనలతో ముడిపెట్టి భారత్ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ పాక్ పై భారత్ సైనిక దాడికి ఒడిగడితే తిప్పికొట్టడానికి పాక్ సిద్దంగా ఉంది' అంటూ పాక్ సైనిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
కాగా, చనిపోయిన ఇద్దరు పాక్ సైనికులకు షరీఫ్ నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే బుధవారం నాడు ఎల్ఓసీ బోర్డర్ నుంచి లాంచ్ ప్యాడ్ల ద్వారా జమ్మూ కశ్మీర్ మరియు ఇతర మెట్రో నగరాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ సైనిక దాడి చేసింది.
ఎల్ఓసీ బోర్డర్ వెంబడి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి పాకిస్తాన్ ఇప్పటికీ ఏమాత్రం సిద్దంగా లేదని, ఇటీవల ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులంతా పాకిస్తాన్ లో శిక్షణ తీసుకున్నారని భారత లెఫ్టినెంట్ జనరల్, డైరెక్టర్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ రణ్ బీర్ సింగ్ తెలిపారు. కాగా, యూరీ ఉగ్ర దాడిలో 18మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయాక పాక్ పై భారత్ చేపట్టిన మేజర్ సైనిక చర్య ఇదే.
జమ్మూ కశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీతో పాటు జమ్మూ గవర్నర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లకు పాక్ పై భారత సైనిక దాడి గురించి ఇండియన్ ఆర్మీ వివరించింది. సైనిక చీఫ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమన్వయం ద్వారా ఈ 'సర్జికల్ స్ట్రైక్' ను చేపట్టినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోకి భారత సైనికులు 3కి.మీ ల మేర చొచ్చుకెళ్లి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా ఇద్దరు పాక్ సైనికులతో పాటు ఆరు పాకిస్తాన్ సైనిక క్యాంపులు ధ్వంసమైనట్టు సమాచారం.
సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను ఏరివేయడం సీరియస్ గా పరిగణించాల్సిన విషయమని, ఇందుకోసం ఈ ఏడాది ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాదాపు 20 ఉగ్ర ఏరివేతల ఆపరేషన్స్ విజయవంతమయ్యాయని రణ్ బీర్ సింగ్ వెల్లడించారు. భారత్ ఉద్దేశ్యం శాంతిని ప్రశాంతతను నెలకొల్పేందుకేనని అయితే సరిహద్దు వెంబడి ఉగ్ర కదలికలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా తమకు సహకరించాలని ఆయన సూచించారు.