కాంగ్రెస్ సీఎంకు మోడీ అభినందన, సచిన్ టెండుల్కర్కూ
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడంపై అస్సాం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పరిశుభ్రమైన భారత్ కోసం కృషి చేసేలా అస్సాం ప్రజలకు తరుణ్ గొగోయ్ స్ఫూర్తి కలిగిస్తున్నారని మోడీ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. తరుణ్ గొగోయ్ కూడా ట్వీట్ చేశారు. 'క్లీన్ అస్సాం'ను గౌహతిలో చేపడితే మంచి స్పందన వచ్చిందన్నారు.
సచిన్ ప్రయత్నం పైన కూడా మోడీ స్పందించారు. సచిన్ ప్రయత్నంపై ఆయనను అభినందిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. అందరు కలిసి పని చేస్తే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇందులో పాల్గొనాలని సచిన్, ప్రియాంక చోప్రా, అనిల్ అంబానీ తదితరులకు మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందుకు సచిన్ సహా అందరు సమ్మతి తెలిపారు.
కాగా, భారత ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు భారత్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు. ఆదివారం కొంతమంది యువకులతో కలిసి సచిన్ టెండూల్కర్ స్వయంగా చీపురు పట్టి ముంబైలోని ఓ విధిని ఊడ్చి శుభ్రం చేశాడు.
‘ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్లో నాయకత్వ బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి మా జట్టుతో ఇక్కడికి వచ్చి.. పరిసరాలను శుభ్రం చేశాను'అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. స్వచ్ఛ భారత్పై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సచిన్తో సహా తొమ్మిది మంది ప్రముఖులను ఈ కార్యక్రమం అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.